జూలైలో వర్చువల్ సమావేశాలు
న్యూఢిల్లీ, జూన్ 10
కరోనా వైరస్ కారణంగా దేశంలో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దాని ప్రభావం పార్లమెంటు సమావేశాలపై కనిపిస్తోంది. గత సంప్రదాయాల లాగే వర్షాకాల సమావేశాల నిర్వహణ సాధ్యం కాదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు ఇరు సభల సెక్రటరీ జనరల్స్ స్పష్టం చేశారు. కనీసం ఒక మీటరు భౌతిక దూరం పాటిస్తూ సీట్లకు కేటాయించినా, సమావేశ మందిరాల్లో సభ్యులందరికీ సీట్లు కేటాయించలేమన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో, విజ్ఞానభవన్ ప్లీనరీ హాల్లో అందరు సభ్యులకు సీట్లు కేటాయించగలిగేంత స్థలం లేదన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఎంతమంది ఎంపీలకు సభలో సీట్లు కేటాయించగలమో వారికి తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ సీట్లను ఏర్పాటు చేస్తే రాజ్యసభ సమావేశ మందిరంలో 60 మందికే కూర్చునే అవకాశం లభిస్తుంది అలాగే పార్లమెంట్ సెంట్రల్హాల్లో 100 మందికే కూర్చునే వీలు కల్పించవచ్చన్నారు. అందరూ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు హాజరుకావడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదంటున్నారు. అందుకే ఆన్లైన్ ద్వారా వర్చువల్ విధానంలోనో, లేదా హైబ్రిడ్ విధానంలోనో సమావేశాల నిర్వహణ మవుతుందా? అనే విషయాన్ని ఓం బిర్లా, వెంకయ్య పరిశీలించారు. కొందరు సభ్యులు ప్రత్యక్షంగా సమావేశాలకు హాజరైతే మిగతావారు వీడియో లింక్ ద్వారా వర్చువల్గా సభా కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చు. ఆయా ఎంపీలు ఎప్పుడు పాల్గొనవచ్చో తెలియచేయనున్నారు.పార్లమెంటు సమావేశాలను వర్చువల్గానో, హైబ్రిడ్ విధానంలోనో నిర్వహించడానికి సంబంధించి అన్ని సాంకేతిక అంశాలను పరిశీలించాలని సెక్రటరీ జనరల్స్ను ఇరు సభల అధ్యక్షులు ఆదేశించారు. అంతేకాదు రోజువిడిచి రోజు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా పార్లమెంటులో వివిధ బిల్లులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. గతంలోలాగా సభన స్తంభింపచేయడం, పార్లమెంట్ బయట ఆందోళనలు చేయడం విపక్షాలకు అంతగా సాధ్యం కాకపోవచ్చు.