వైసీపీకి అనుకూలంగా తమ్ముళ్లు
ఒంగోలు, జూన్ 10,
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్ట కోసం నిప్పు పుట్టందని మరొకడు సంబరపడ్డట్టుగా ఉంది టీడీపీ పరిస్థితి. పార్టీ ఓడిపోయి.. అధికారం కోల్పోయి.. టీడీపీ అధినేత చంద్రబాబు నానా తిప్పలు పడుతున్నారు. దీంతో నేతలు చెదిరి పోకుండా ఉండేందుకు తనదైన శైలిలో ఆయన వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నారు. కానీ, అధికార వైసీపీ దూకుడు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ప్రతిపక్ష పార్టీకి ఆ గౌరవం కూడా లేకుండా చేయాలనే కాంక్షతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలను నయానో.. భయానో తనవైపునకు తిప్పుకొనేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలోనే ఇప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముగ్గురు వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. అయితే, మరో నలుగురిని ఇలా తనవైపు మళ్లించుకుంటే.. టీడీపీకి ప్రధాన ప్రతిపక్షం అనే హోదా లేకుండా చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోనే ప్రకాశం నుంచి గెలిచిన నలుగురిపై వల విసిరారు. వీరిలో ఒకరు కరణం బలరాం.. చిక్కారు మిగిలిన ముగ్గురు చిక్కినట్టే చిక్కి జారిపోయారు. దీంతో వారి బిజినెస్లను ప్రభుత్వం టార్గెట్ చేసిందనే విమర్శలు.. వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.. ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు గనుల వ్యాపారాలపై అధికారులు వరుస దాడులు చేస్తున్నారు.దీంతో ఆయా నేతలు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారు. అయినా.. లాక్డౌన్ సమయంలోను, తర్వాత కూడా అదే గనులు, వ్యాపారాలకు సంబంధించి ప్రభుత్వం కొన్నింటిపై నిషేధం విధించింది. ఇది కోర్టులకు వెళ్లినా తేలే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు జగన్ను శరణుజొచ్చి.. సమస్యను పరిష్కరించుకోక పోతే.. వందల కోట్ల రూపాయల నష్టం రావడం ఖాయం. దీంతో ఇప్పుడు టీడీపీని వీడడమే మంచిదని నిర్ణయానికి వచ్చారనే ప్రచారం సాగుతోంది. వాస్తవానికి ఇప్పటికే టీడీపీతో అంతర్గతంగా చర్చలు జరిగాయి. ఏదైనా సరే.. మీరు పోరాడండి.. మిగిలింది నేను చూసుకుంటాను. అని చంద్రబాబు చెప్పారు.కానీ, ఇప్పటి వరకు చంద్రబాబు వీరిని పట్టించుకోలేదు. మరోపక్క, జగన్ దూకుడు పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా గొట్టిపాటి రవి నేతృత్వంలో మాజీ మంత్రి శిద్దా.. కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు వంటివారు ఓ హోటల్లో భేటీ అయి.. తాజా పరిస్థితిపై సమీక్షించారు. పార్టీలో ఉండి బాధలు పడడం కన్నా.. వ్యాపారం కోసం మార్పు కోరుకోవడమే మంచిదని నిర్ణయించుకున్నారు. మొత్తంగా ఈ పరిణామంపై ఇప్పటికిప్పుడు ఫైనల్ నిర్ణయానికి రాకపోయినా.. టీడీపీలో ఉండి సాధించేది లేదని మాత్రం నిర్ణయించుకున్నారని టాక్..? ఇక ఇదే జిల్లాకు చెందిన పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సైతం పార్టీ మారతారని వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు ఆయనకు రాష్ట్ర స్థాయి పదవి ఇస్తానని బుజ్జగించి ఆపినట్టు తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కుమారుడు సుధీర్ బాబు రాజకీయ భవిష్యత్తు కోసం అయినా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.