కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే మృతి
చెన్నై జూన్ 10
కరోనాతో డిఎంకె ఎమ్మెల్యే అన్బళగన్ కన్ను మూశారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ప్రైవేటు హాస్పటల్ లో చికిత్స కోసం చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. ఈ నెల రెండో తేదిన కరోనా వైరస్ తో ఆసుపత్రిలో చేరారని క్రోమ్ పేటలోని డాక్టర్ రేలా ఇనిస్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్ వైద్యులు వెల్లడించారు. మంగళవారం రాత్రి నుంచి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో బుధవారం తెల్లవారుజామున అన్బళగన్ తుదిశ్వాస విడిచారన్నారు. అయనకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా అన్బళగన్ పుట్టిన రోజు నేడు. జన్మదినం రోజునే ఆయన మరణించడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక అన్బళగన్ డీఎంకే పార్టీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001, 2011, 2016లో ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. చెన్నై చేప్పాకం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామితో పాటు పలువురు సంతాపం ప్రకటించారు.