ఎస్ఈసీ నిమ్మగడ్డ కేసు
స్టే నిరాకరించిన సుప్రీం
న్యూఢిల్లీ జూన్ 10
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ జరిగింది. రమేష్ కుమార్ ను కమిషనర్ గా కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై సుప్రీంకోర్టు లో ఏపీ సర్కారు అప్పీలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సదరు తీర్పుపై స్టే ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై ముగ్గురు సభ్యుల (ప్రధాన న్యాయమూర్తి బాబ్డే, న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, హృషికేష్ రాయ్) ధర్మాసనం విచారించింది. హైకోర్టు తీర్పుపై స్టే నిరాకరించిన సుప్రీం కోర్టు, రాజ్యాంగ సంస్థల పైన ఆటలు తగవని వ్యాఖ్యానించింది. ప్రతివాదులకు రెండు వారాల్లో నోటీసులు ఇవ్వాలని సుప్రీం సూచించింది.