మూడు పదవుల కోసం...30 మంది పోటీ
హైద్రాబాద్, జూన్ 11
తెలంగాణ రాష్ట్ర సమితిలో మరోసారి పదవుల కోసం నేతల మధ్య పోటీ మొదలైంది. మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం టీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టిలో పడేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేసీఆర్ ఎవరికి ఖరారు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తున్న టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డికి మరోసారి పదవిని రెన్యూవల్ చేస్తారా లేదా అనే చర్చ పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతోంది.త్వరలోనే తెలంగాణలో గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇవి మూడు గవర్నర్ కోటాలోనివే. దీంతో అధికార పార్టీ సిఫార్సు మేరకే ఎమ్మెల్సీలు ఎంపిక కాబోతున్నారు.ఈ మూడు పదవులకు టీఆర్ఎస్లో పలువురు సీనియర్ నేతలు, జూనియర్లు, టిక్కెట్లు దక్కని వారు, అసెంబ్లీ ఎన్నికలలో ఓడిన వారు పలువురు ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ పదవి కాలం ముగుస్తున్న సీనియర్ నేతలు నాయిని నరసింహారెడ్డి, కర్నె ప్రభాకర్ కూడా తమకు మళ్లీ ఎమ్మెల్సీ ఇస్తారని నమ్మకంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ ఎవరిని కరుణిస్తారనేది చూడాల్సి ఉంది.ఇప్పటికే గవర్నర్ కోటాలో ఎన్నికైన రాములు నాయక్ స్థానం ఖాళీగా ఉంది. నాయిని నరసింహారెడ్డి పదవీకాలం ఈ నెల 17వ తేదీన ముగుస్తోంది. మరో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పదవీకాలం కూడా రెండు నెలలు మాత్రమే ఉంది. నాయిని నరసింహారెడ్డి టీఆర్ఎస్లో అత్యంత సీనియర్, కష్టకాలంలోనూ పార్టీకి అండగా నిలిచిన నేత. ఆయన సేవలను గుర్తించి మొదటిసారి అధికారంలోకి రాగానే ఆయనకు కీలకమైన హోంశాఖ మంత్రి పదవి అప్పగించారు కేసీఆర్. కానీ, 2018 ఎన్నికల సమయం నుంచి నాయిని పార్టీ పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఆయన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ముషీరాబాద్ ఎమ్మెల్సీ టిక్కెట్ కూడా నాయిని తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డారు.తర్వాత రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆయనను క్యాబినెట్లోకి తీసుకోలేదు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని అనుకున్నా దక్కలేదు. దీంతో ఆయన బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. గులాబీ జెండాకు తాము ఓనర్లం అని కూడా ఒక సమయంలో అన్నారు. తన సన్నిహితుడు కావడంతో కేసీఆర్ ఆయనను పిలిపించి మాట్లాడి భవిష్యత్లో అవకాశాలు ఇస్తానని హామీ ఇచ్చారు.దీంతో నాయిని చల్లబడ్డారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం కూడా ముగుస్తుండటంతో ఆయనకు మళ్లీ రెన్యూవల్ చేస్తారని ఆశగా ఉన్నారు. కర్నే ప్రభాకర్ కూడా చాలా కాలంగా టీఆర్ఎస్లో కీలకంగా ఉన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఆయన ప్రయత్నించినా ఆయన కోరిక నెరవేరలేదు.దీంతో కర్నె ప్రభాకర్కు ఎమ్మెల్సీ ఇచ్చారు కేసీఆర్. ఇప్పుడు ఆయనకు మరోసారి ఇస్తారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన మాత్రం కచ్చితంగా తన పదవి మరోసారి రెన్యువల్ చేస్తారని నమ్మకంగా ఉన్నారు. ఇక, ఎస్టీకి అవకాశం ఇవ్వాలని గతంలో కేసీఆర్ రాములు నాయక్ను ఎమ్మెల్సీ చేశారు.ఇప్పుడాయన కాంగ్రెస్లోకి వెళ్లారు. దీంతో ఈ స్థానం మళ్లీ ఎస్టీలకే ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ అలా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాంనాయక్కు అవకాశం దక్కవచ్చు. ఆయనకు గత పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్నా టిక్కెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆయనను ఎమ్మెల్సీ చేయవచ్చు.వీరితో పాటు ఈ పదవులకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. బలమైన నేత అయినా, సిట్టింగ్ ఎంపీ అయినా ఆయనకు ఖమ్మం ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో రాజ్యసభ సభ్యత్వం పక్కా ఇస్తారని అంతా అనుకున్నారు.అక్కడా ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా ఇస్తారనే చర్చ జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఓఎస్డీగా ఉన్న దేశపతి శ్రీనివాస్ కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఆయన పట్ల కూడా కేసీఆర్ సానుకూలంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. వీరితో పాటు ఇంకా చాలా మంది ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడుతున్నారు. మరి, వీరిలో కేసీఆర్ ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.