జగన్ దేవుడు... మాట మార్చిన డాక్టర్ సుధాకర్
విశాఖపట్టణం, జూన్ 11,
ఏపీలో సంచలనం రేపిన డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ గురించి తెలిసిందే. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కొనసాగుతుండగా.. సుధాకర్ కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తర్వాత ఆయన ఎక్కడా కనిపించలేదు.. అయితే చాలా రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. విశాఖలో జరిగిన గొడవ.. పోలీసుల అరెస్ట్ చేయడంపై స్పందించారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.తాను బ్యాంక్ పనిమీద వెళుతుండగా కొందరు ఫాలో అయ్యారని కారు ఆపానన్నారు సుధాకర్. అప్పటికే కారులో కొంత డబ్బు ఉందని.. వెంబడిస్తున్నారని కారు దిగితే అల్లరిమూకలు తనపై దాడి చేశారన్నారు. తాను తాగి అల్లరి చేస్తున్నానని పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని.. ఆ రోజు పోలీసులు తనను కొట్టలేదని, కొంతమంది రౌడీ మూకలు కొట్టి, షర్ట్ విప్పారన్నారు. అసలు తాను మద్యం సేవించలేదన్నారు. తనకు అసలు ప్రభుత్వాన్ని తిట్టాల్సిన అవసరం లేదన్నారు. మోదీని తాను తిట్టలేదన్నారు.. అసలు వాళ్లను తిట్టే ధైర్యం లేదని.. ప్రధాని అంటే ఇష్టమన్నారు. సీఎం జగన్ తనకు దేవుడని.. పేదలకు మంచి పనులే చేస్తున్నారని.. అలా అని తనకు ఒక పార్టీ అంటూ ఏమీ లేదన్నారు.తాను చంద్రబాబు పార్టీ అంటూ ముద్ర వేస్తున్నారని.. తాను చంద్రబాబు కార్యకర్తను కాదు.. అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లడమే తాను చేసిన పెద్ద తప్పు అన్నారు. ఎవరికో చెడ్డ పేరు తెచ్చేందుకే తనపై దాడి చేశారని.. పిచ్చోడి ముద్ర వేసి తన ఉద్యోగి తీయించేందుకు కుట్ర చేశారన్నారు. తనను పంపాలని నర్సీపట్నం నుంచి పంపించాలని ప్రయత్నిస్తున్నారని.. డిస్మిస్ చేయాలని ప్లాన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ తనను క్షమించి తిరిగి తన ఉద్యోగం ఇప్పించాలని కోరారు.ఇక తాను ఏ కేసులూ వద్దని చెప్పినా సుమోటోగా కొంతమంది కేసు వేశారని సుధాకర్ అంటున్నారు. తనకు ఇంకా 8 ఏళ్ల సర్వీస్ ఉందని.. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయంటున్నారు. తాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందామని అనుకునేలోపే ఇదంతా జరిగిందన్నారు. కేసులు విత్ డ్రా చేసుకుంటానని.. తన ఉద్యోగం తనకు ఇప్పిస్తే చాలని విఙ్ఞప్తి చేశారు. తన వలన ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలన్నారు సుధాకర్.