ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమల గళం
గుంటూరు, జూన్ 12,
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే సరైన సమయం అని కేంద్ర నాయకత్వం కూడా భావిస్తుంది. ఇప్పటి వరకూ బీజేపీ ఏపీలో ఎదగకపోవడానికి అనేక కారణాలున్నాయి. ఇప్పుడు ఆ సమస్యలన్నింటిని బీజేపీ అధిగమించింది. తెలుగుదేశం పార్టీతో భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని కేంద్ర నాయకత్వం తెగేసి చెప్పేసిందని సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు అందాయి.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉంది. నాయకత్వ సమస్య ఏర్పడింది. టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి అధికార పార్టీ వైసీపీతో ఢీకొనే శక్తి ఉందా? అన్న సందేహాలు ఆ పార్టీలోనే తలెత్తతున్నాయి. ఏపీలో టీడీపీకి ప్రత్యామ్నాయంగా తాము ఎదగాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ పరం చేసుకునే విధంగా రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే బీజేపీ ఏపీలో జనసేనతో జట్టుకట్టింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలసి పోటీ చేయడం ఖాయం. టీడీపీతో కలసి నడిస్తే తమ పార్టీకి భవిష్యత్ ఉండదని గ్రహించిన బీజేపీ నేతలు ఆ ఆలోచన విరమించుకున్నారు. టీడీపీ ఆలోచనను మనసుల్లోనుంచి చెరిపేయాలని ఇటీవల కేంద్రం నుంచి వచ్చిన నేత ఒకరు రాష్ట్ర నేతలకు సూచించినట్లు తెలిసింది. అందుకే ఇటీవల టీడీపీ కంటే ఎక్కవుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో బీజేపీ ఫోకస్ అవుతుంది.నిమ్మగడ్డ రమేష్ కుమర్ , ఇంగ్లీష్ మీడియం, ఎల్జీ పాలిమర్స్ వంటి వాటిల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కేసులు వేసింది. కరోనా టెస్ట్ కిట్లలో అవినీతి జరిగిందంటూ టీడీపీ కంటే బీజేపీయే తొలుత రెస్పాండ్ అయింది. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయడంలో బీజేపీ నేతలు టీడీపీ కంటే ముందుంటున్నారు. ఇదంతా హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే నని అంటున్నారు. టీడీపీని జీరో చేసి ఆ ప్లేస్ ను తాము ఆక్రమించాలన్నది బీజేపీ ప్రయత్నంగా ఉంది. మరి ఇది అత్యాశగా కనపడుతున్నా.. ఏమో గుర్రం ఎగరావచ్చు.