టీ కాంగ్రెస్ లో రహస్య భేటీ రచ్చ
హైద్రాబాద్, జూన్ 13
తెలంగాణ కాంగ్రెస్లో రహస్య భేటీ మంటలు రేపుతోంది. కొత్త పీసీసీ అధ్యక్షుడు రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో, వారి సీక్రెట్ సమావేశం, అగ్గి రాజేస్తోంది. ఒకరికి వ్యతిరేకంగా, మరొకరికి అనుకూలంగా స్కెచ్ వేసేందుకే, భేటి అయ్యారన్న వార్తలు, కాకలు తీరిన కాంగ్రెస్ నేతలకు కుదురుగా ఉండనివ్వడం లేదు. అసలు టీ కాంగ్రెస్లో తుపానుగా మారిన, ఆ రహస్య సమావేశమేంటి? దాని అజెండా ఏంటి? తెరవెనకుండి నడిపిస్తోంది ఎవరు?తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ మార్పు ఫోబియా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీ నేతల రహస్య సమావేశాలు, చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఎలాగైనా తమకైనా పీసీసీ పీఠం దక్కాలి, లేదంటే మనకు అనుకూలమైన నేతనే వరించాలి, పొరపొటున కూడా, మనకేమాత్రం పడని లీడర్కు గాంధీభవన్ పీఠం దక్కేందుకు వీల్లేదంటూ గ్రూపులు కడుతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు లాబీయింగ్ చేస్తున్నారు. ఎవరి అజెండా ప్రకారం ఆ వర్గం నేతలు మీడియా ముందుకొచ్చి ఒక్కో వెర్షన్ వినిపిస్తున్నారు. సోమవారం సీఎల్పీ ఆఫీసులో ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్బాబు రెండు గంటల పాటు రహస్య మంతనాలు జరపడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీసీసీ మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. పీసీసీ మార్పుపై అధిష్ఠానం అభిప్రాయం కోరితే ఏం చెప్పాలనే దానిపై చర్చ జరిపినట్లు ఆ నేతలు చెబుతున్నారు.