రాజమహేంద్రవరంలో టీడీపీ నిరసన
రాజమండ్రి జూన్ 13
ప్రజలచే ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నిక కాబడిన టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడి అరెస్టు రాజ్యాంగ విరుద్ధమని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. అచ్చెన్నాయుడి అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక గోవకరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశి నవీన్, ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరరావులు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దానిలో భాగంగానే అసెంబ్లీలో ప్రశ్నించే వారిని లేకుండా చేయాలన్న ఉద్దేశంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే, శాసన సభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని ఆరోపించారు. అణగదొక్కే ధోరణి వ్యవహరిస్తున్న జగన్ ఎస్సీల తరువాత బీసీలపై పడ్డారని మండిపడ్డారు. ఇది సరైన విధానం కాదని సూచించారు. తెలుగుదేశం పార్టీ ఉపనాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారనే ఉద్ధేశ్యంతోనే అరెస్టు చేసారని ఆరోపించారు. నాలుగు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి బీసీల నోరు నొక్కాని జగన్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ, బీసీ ఓట్లతో గద్దెనెక్కిన జగన్ అవేమీ పట్టించుకోకుండా వారిపైనే కక్షసాధింపునకు దిగడం దారుణమన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీ, ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీలను ఎంత అణగదొక్కాలని ప్రయతిస్తే అంత ఎత్తుకి ఎదుగుతామని హెచ్చరించారు.