గజ్వేల్ పట్టణంలో పట్టణవాసుల కోసం వెజ్, నాన్వెజ్ మార్కెట్ను ఆధునిక హంగులతో నిర్మిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ను నిర్మిస్తుండడంతో అన్నివిధాలుగా అందరికీ మరింత చేరువలోనే కూరగాయలు, మాంసం, పండ్లు, పూలు అందుబాటులోకి వస్తాయి. ప్రారంభంలో రూ.7.30కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించగా, ప్రస్తుతం వ్యయం రూ.19.85 కోట్లకు పెంచారు. అన్నిరకాల వసతులతో నిర్మాణాలను త్వరగా పూర్తయ్యేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. మే15 నాటికి త్వరగా పూర్తి కానుంది. కూరగాయల వ్యాపారుల కోసం ప్రత్యేకంగా మార్కెట్లో వాష్ ఏరియాను ఏర్పాటు చేస్తున్నారు. కూరగాయలను నీటితో కడుకునే వెసులుబాటును కల్పిస్తారు. తాజాగా కూరగాయలనే వినియోగదారులకు అమ్మాలనే ఉద్దేశంతో వాష్ ప్లాట్పాంను ఏర్పాటు చేస్తున్నారు. ఆరు నెలల క్రితం పనులను సీఎం ప్రారంభించగా, ప్రస్తుతం 80శాతం పనులు పూర్తి కావచ్చాయి. గడువులోగా పనులు పూర్తిచేసే దిశగా రోజు 300 మంది కార్మికులను పనుల్లో నిమగ్నం చేశారు. ఆరు ఎకరాల ప్రదేశాన్ని మార్కెట్ నిర్మాణానికి కేటాయించగా, అందులో ఎకరం మూడు గుంటల విస్తీర్ణంలో మార్కెట్ నిర్మాణం జరుగుతున్నది. మార్కెట్కు ప్రధాన ద్వారంతో పాటు మరో మూడు ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశంతోపాటు పార్కును కూడా మార్కెట్కు ఓ పక్కన ఏర్పాటు చేయనున్నారు. పెద్ద మార్కెట్ కావడంతో అక్కడికి వచ్చే వారిని దృష్టిలో ఉంచుకొని విడివిడిగా బాత్రూంలను నిర్మిస్తున్నారు. వెజ్ మార్కెట్లో ఇప్పటికే 120 స్టాల్స్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. స్టాల్స్ వ్యాపారులకు అనువుగా ఉండేలా టైల్స్ తో ఏర్పాటు చేశారు. మార్కెట్కు వచ్చే వారు అన్నిరకాల వస్తువులను ఒకే చోట కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. స్టాల్స్పైన రేకుల షేడ్లను ఏర్పాటు చేయనున్నారు. విశాలంగా ఉం డేలా నిర్మాణాలు చేపడుతున్నారు. 120 వెజ్ స్టాల్స్ పూర్తవగా, 53 నాన్ వెజ్ స్టాల్స్, మరో 60 నుంచి 65 వరకు పూలు, పండ్ల వ్యాపారుల కోసం స్టాల్స్ల నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. మార్కెట్కు వచ్చే వారికి ఎలాంటి సమస్యలు కలుగకుండా తగిన విధంగా మార్కెట్ అందుబాటులోకి రానున్నది. మార్కెట్కు నాలుగు వైపులా నాలుగు గేట్లను ఏర్పాటు చేస్తున్నారు.