పార్ట్ టైం పాలిటిక్స్ లో జనసేనాని
విజయవాడ, జూన్ 15
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు చేసే పరిస్థితి కన్పించడం లేదు. మిగిలిన పార్టీలు తమకు అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటుండగా పవన్ కల్యాణ్ మాత్రం పట్టీపట్టన్నట్లు ఊరుకుంటున్నారు. పవన్ కల్యాణ్ హైదరాబాద్ కే పరిమితమయ్యారు. సినిమా షూటింగ్ లు ప్రారంభం కావడంతో ఆయన మరికొ్ది రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండే అవకాశముంది. పవన్ కల్యాణ్ ఏరోజూ సీరియస్ గా పాలిటిక్స్ ను తీసుకోలేదు. పార్టీ 2014కు ముందే పెట్టినా అప్పటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇందుకు కారణం జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా లేకపోవడమేనని విరమణ ఇచ్చుకున్నారు. పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకముందే పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. దీంతో పవన్ బలాన్ని అందరూ ప్రశంసించారు. పవన్ కల్యాణ్ మద్దతు వల్లనే 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారాన్న ప్రచారం ఉంది. ఇక 2019 ఎన్నికలకు వచ్చే సరికి ఆయన రూట్ మారింది.పవన్ కల్యాణ్ కు 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిసినా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయలేదు. తనకు వీలున్నప్పుడు రెండు, మూడు చోట్ల పర్యటించడం, అక్కడ డైలాగులు కొట్టి వెళ్లిపోవడం జరిగింది. ఎన్నికల ప్రచారాన్ని కూడా సీరియస్ గా తీసుకోలేదు. దీంతో కమ్యనిస్టులతో కలసి పోటీ చేసిన పవన్ కల్యాణ్ కు ఒక్క సీటు మాత్రమే దక్కింది. అయినా ప్రజాతీర్పు చూసిన తర్వాతైనా పవన్ కల్యాణ్ లో మార్పు రాలేదు.కరోనా లాక్ డౌన్ తర్వాత ఏపీలో రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. బీజేపీ, టీడీపీ ప్రధానంగా అధికార వైైసీపీపై విరుచుకుపడుతుంది. ప్రతి అంశంలోనూ ఈ రెండు పార్టీలే ముందంజలో ఉంటున్నాయి. జనసేన మాత్రం ట్వీట్లకే పరిమితమయిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికైనా పార్టీని బలోపేతం చేయాలన్న యోచన పవన్ కల్యాణ్ లో కన్పించడం లేదంటున్నారు. బీజేపీతో జత కట్టడంతో పార్టీ క్యాడర్ లేకపోయినా పరవాలేదన్న ధీమాలో పవన్ కల్యాణ్ ఉన్నట్లు కన్పిస్తుంది. మొత్తం మీద పవన్ కల్యాణ్ మీద జనసైనికులు పెట్టుకున్న ఆశలు నెరవేరేటట్లు కన్పించడం లేదు.