లాక్ డౌన్ విధిస్తారంటూ ఊహాగానాలు
న్యూఢిల్లీ, జూన్ 15,
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. ఇప్పటికే మూడు లక్షల కేసులు దాటగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల లిస్టులో భారత్ నాలుగో స్థానానికి చేరింది. అమెరికా, బ్రెజిల్, రెష్యా తర్వాత భారత్ కరోనా కేసుల సంఖ్యలో నాలుగో స్థానంలో నిలిచింది. దేశంలో 2 లక్షల నుంచి 3 లక్షల కేసులు చేరడానికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే పట్టింది. ప్రతీ రోజూ సుమారు 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయనే విశ్లేషణలు వినబడుతున్నాయి.కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరోసారి దేశంలో లాక్డౌన్ విధించబోతున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నెల 21 నుంచి దేశంలో మరోసారి లాక్డౌన్ విధిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారంలో వాస్తవం లేదని, మరోసారి లాక్డౌన్ విధించే యోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నిజానికి ఈ నెలాఖరు వరకు దేశంలో లాక్డౌన్ కొనసాగుతోంది. కానీ, చాలా మేరకు సడలింపులు ఇవ్వడంతో లాక్డౌన్ ఉన్నా లేనట్లే అనేలా పరిస్థితి ఉంది. దేశమంతా సాధారణ జీవనం మొదలైంది.ప్రజలు రోడ్లెక్కుతున్నారు. వ్యాపారాలు మొదలయ్యాయి. చాలావరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పని చేస్తోంది. సడలింపుల కారణంగానే దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే, 130 కోట్లకు పైగా జనాభా కలిగిన భారతదేశంలో మూడు లక్షల కేసులు నమోదు కావడం పెద్ద ప్రమాదకరం ఏమీ కాదని నిపుణులు చెబుతున్నారు. పైగా భారత్లో కరోనా వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ లేదని ఐసీఎంఆర్ చెబుతోంది. కేంద్రం చెబుతున్న దాని ప్రకారం మళ్లీ దేశంలో లాక్డౌన్ విధించే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు.నిజానికి రెండు నెలల పాటు దేశం సంపూర్ణ లాక్డౌన్లో ఉంది. సువిశాల భారత దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే లాక్డౌన్ ఒక్కటే మార్గమని నిపుణులు భావించారు. కానీ, కరోనా వ్యాప్తి వేగాన్ని లాక్డౌన్ తగ్గించింది కానీ పూర్తిగా లాక్డౌన్ సఫలమైందని మాత్రం చెప్పలేని పరిస్థితి. పైగా లాక్డౌన్ కారణంగా దేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించింది. ప్రజలు ఉపాధి కోల్పోయారు. పేదలు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఇక ఎక్కువ కాలం లాక్డౌన్ కుదరదని భావించిన కేంద్రం సడలింపులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇప్పటికిప్పుడు కరోనాను కట్టడి చేసే పరిస్థితి లేనందున ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా కరోనాను ఎదుర్కోవడం ఒక్కటే మార్గంగా ప్రభుత్వం భావిస్తోంది.అయితే, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్లో కరోనా వైరస్ ప్రమాదఘంటికలు మొగిస్తోంది. ఈ రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. కరోనా బాధితులకు సరైన చికిత్స కూడా అందటం లేదు. రోజురోజుకూ ఇక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మిగతా రాష్ట్రాల్లోనూ కొన్ని నగరాలు, జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తిగా వేగంగా ఉంది.హాట్స్పాట్లలోనే వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లోనూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్యా మరోసారి నగరంలో సంపూర్ణ లాక్డౌన్ విధించే అంశంపై త్వరలో కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఇక, 16 లేదా 17వ తేదీన ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడబోతున్నారు. కరోనా కట్టడికి లాక్డౌన్ కాకపోయినా మరికొన్ని కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి.