బీజేపీ వైపు సీనియర్ నేతల చూపు
కరీంనగర్, జూన్ 15
గతేడాది జరిగిన లోకసభ ఎన్నికలతో అనూహ్యంగా పుంజుకొన్న బీజేపీ భవిష్యత్పైనా దృష్టిపెట్టింది. తమ గెలుపు పాలపొంగు కాదని, వచ్చే ఎన్నికలకు సంకేతమంటూ చెబుతున్న పార్టీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులు, జిల్లా ముఖ్యనాయకులను కమల దళంలో చేరుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు బిరుదు రాజమల్లు, పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలువాక రాజయ్య బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. వీరు కూడా నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి కమలం గూటికి చేరడానికి సుముఖం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈమేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్తో మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఎప్పుడు, ఎక్కడ చేరాలనే విషయంపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, టీఆర్ఎస్కు చెందిన ఇరువురు నాయకులు కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.జిల్లాలో బీజేపీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఉత్తర తెలంగాణకు సంబంధించి పెద్దపల్లి మినహా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోకసభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతంద చేసి పెద్దపల్లిలోనూ పాగా వేయాలని పార్టీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎంపీ జి.వివేక్ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చేందుకు సిద్దపడ్డా, చివరిక్షణంలో వివేక్ ముందుకు రాకపోవడంతో కుమార్కు బీఫారం ఇచ్చింది. ఆ తరువాత బీజేపీలో చేరిన వివేక్ పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తనకున్న పరిచయాలతో నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను పార్టీలోకి ఆకర్షిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు సోమారపు సత్యనారాయణ జిల్లా అధ్యక్షుడిగా నియమింపబడడం కార్మికక్షేత్రంలో పార్టీకి కలిసొచ్చింది. ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బండి సంజయ్ రాష్ట్ర పగ్గాలు చేపట్టడం, పార్టీ జిల్లా శ్రేణులను మరింత ఉత్సాహపరిచింది. ఇతర పార్టీల్లోని నేతలు బీజేపీ వైపు మొగ్గుచూపేందుకు ‘బండి’ నియామకం దోహదం చేసింది. అనూహ్యం పరిణామాలు చోటుచేసుకుంటే తప్ప బిరుదు రాజమల్లు, ఎలువాక రాజయ్య వారం, పదిరోజుల్లో కాషాయ గూటికి చేరడం ఖాయమే.