గుడివాడ అమర్నాధ్ కు మంత్రి పదవి..?
విశాఖపట్టణం, జూన్ 16,
విశాఖలో వైసీపీని ఎంతవరకూ పార్టీపరంగా పటిష్టం చేశారో తెలియదు కానీ వైఎస్ జగన్ వేవ్ పుణ్యమాని ఒక్కసారిగా ఎమ్మెల్యేలు అయిపోయిన వారంతా ఇపుడు పెద్ద కుర్చీ కోసం అర్రులు చాస్తున్నారు. మంత్రి పదవే తమ టార్గెట్ అనుకుంటున్నారు తప్ప పార్టీని బలంగా నిర్మిద్దాం, ప్రభుత్వ కార్యక్రమాలు జనంలోకి తీసుకుపోదామన్న తపన ఎవరికీ కనిపించడంలేదు. గెలిస్తే జగన్ వల్లనే గెలుస్తాం, ఓడితే ఆయన ఖాతాలోకే పోతుంది. మనం నిమిత్తమాత్రులం అన్న వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్న గడుసు నాయకులు వైసీపీలో బోలెడు మంది ఉన్నారు. మరి అదే వేదాంతం పదవుల విషయంలో ఎక్కడా లేదు. అందుకే మంత్రి సీటు కోసం కుర్చీలాట మొదలెట్టేస్తున్నారు.విశాఖలో వైసీపీ యువనేత గుడివాడ అమరనాధ్ ఉన్నారు. ఆయన అనకాపల్లి నుంచి తొలిసారి గెలిచారు. అంతకు ముందు ఆయన వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ గా కూడా చేశారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ కి సన్నిహితుడని పేరు. నిజానికి తొలి దఫాలోనే ఆయనకు మంత్రి పదవి రావాలి. అయితే ఎన్నికల వేళ టీడీపీ నుంచి వైసీపీలోకి దూకేసి జిల్లా రాజకీయాల్లో ఊపు తెచ్చిన నేతగా అవంతి శ్రీనివాస్ కి జగన్ ఫస్ట్ చాన్స్ ఇచ్చారు. నాటి నుంచి కాబోయే మంత్రిని నేనేనని గుడివాడ చెప్పేసుకుంటున్నారు. రెండున్నరేళ్ళే అవంతి మంత్రి అని అంటున్నారు. మీడియా ముందు కూడా మొహమాటం లేకుండా ఆయన కాబోయే మంత్రిగా కీర్తనలు అందుకుంటున్నారు.మంత్రిగా ఏడాది పాలనను పూర్తి చేసుకున్న అవంతి శ్రీనివాస్ కి మాత్రం ఈ పరిణామాలు మంట పుట్టిస్తున్నాయట. ఆయన తాను రెండున్నరేళ్ల మంత్రి అనుకోవడంలేదు. అయిదేళ్ల మంత్రిగా ఫీల్ అవుతున్నారు. తనకే జగన్ అయిదేళ్ళూ ఆ ఛాన్స్ ఇస్తారని అవంతి గట్టి నమ్మకం మీద ఉన్నారు. ఆయన అందుకే ఈ మధ్య విజయసాయిరెడ్డిని కూడా మళ్ళీ పొగిడేస్తున్నారు. విశాఖ జిల్లాకు ఆయనే పెద్ద దిక్కు అంటున్నారు. ఆయన నాయకత్వంలోనే జిల్లా అభివ్రుధ్ధి జరుగుతోందని కూడా చెబుతున్నారు. జిల్లాలో వైసీపీ ఏడాది పాలన స్వర్ణయుగమని కూడా చెప్పుకొస్తున్నారు. ఎంతో అభివ్రుధ్ధి చేశామని కూడా అంటున్నారు.ఇక అవంతి శ్రీనివాస్ ఎన్ని చెబుతున్నా ఆయనకు మరో ఏడాదిలో మంత్రి వియోగం తప్పదని పార్టీలో ప్రత్యర్ధులు అంటున్నారు. ఆయన జిల్లాలో పట్టు సాధించలేకపోయారని, ప్రభుత్వ పెద్దగా కూడా అభివ్రుధ్ధి చేయలేపోయారని అంటున్నారు. ఇక గుడివాడే మినిష్టర్ అని ఆయన అనుచరులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తమ నాయకుడికి మంత్రి యోగం ఉందని కూడా జోస్యం చెబుతున్నారు. ఓ వైపు జగన్, మరో వైపు ఎంపీ విజయసాయిరెడ్డి ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా మంత్రి అవంతి ఏడాది పాలన సంబరాలకు గుడివాడ దూరంగా ఉండడం విశేషం. అదే సమయంలో ఆయన జగన్ ఏడాది పాలన భేష్ అంటూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తనను తాను కాబోయే మంత్రిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఈ ఇద్దరి కుర్చీలాటతో పార్టీ పరువు ఎటు పోతుందో తెలియడంలేదని ఇతర నాయకులు వాపోతున్నారు