వైసీపీ బాటలో పొంగూరు..
నెల్లూరు, జూన్ 16,
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో మరో వికెట్ పడనుందా ? చంద్రబాబు కేబినెట్లో కీలక మంత్రిగా వ్యవహరించిన విద్యాసంస్థల అధినేత.. పొంగూరు నారాయణ సైకిల్ దిగేందుకు రెడీ అయ్యారా? అంటే.. తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. సీఆర్డీఏ సహా అమరావతి రాజధాని విషయంలో అన్నీ తానై వ్యవహరించారు నారాయణ. ఆయనకు అమరావతి గుట్టుమట్లు అన్నీ తెలుసని వైసీపీ నాయకులు అప్పట్లోనే ఆరోపించారు. ఇక, అమరావతి రాజధాని విషయంలో భూ కుంభకోణం జరిగిందని, ముందస్తుగానే రియల్ వ్యాపారం జోరందుకుందని, చంద్రబాబు అనుచరులు లబ్ధి పొందారని జగన్ సర్కారు భారీ ఎత్తున ఆరోపించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ప్రస్తుతం త్రిసభ్య మంత్రి వర్గ కమిటీ దీనిపై విచారణ చేస్తోంది. ఇది నివేదిక ఇస్తే.. నారాయణ కీలకంగా మారనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మెడకు ఉచ్చుతగులుకోవడం ఖాయమని ఇప్పటికే టీడీపీలోనూ చర్చ సాగుతోంది. మరోపక్క, నారాయణ విద్యాసంస్థలు కూడా తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇప్పటికే వాటలో నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా కేసులు నమోదయ్యాయి. విజయవాడలో రెండు సంస్థలను సీజ్ చేశారు. ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు కానీ, పార్టీనేతలు కానీ, ఆయనకు అండగా నిలిచింది లేదు. ఈ నేపథ్యంలో ఇక, జగన్పై పోరాటం కంటే.. పార్టీ మారడమే బెస్ట్ అని నారాయణ ఓ నిర్ణయానికి వచ్చినట్టు నెల్లూరులో పెద్ద చర్చ సాగుతోంది.వాస్తవానికి 2014 ఎన్నికల్లో నారాయణ పోటీ చేయలేదు. అయితే, దీనికి ముందు చంద్రబాబు నిర్వహించిన వస్తున్నా మీకోసం పాదయాత్రకు ఆయన ఆర్ధికంగా సాయం చేశారు. ఈ కృతజ్ఞతతోనే ఆయనకు బాబు శాసన మండలిలో సభ్యత్వం ఇచ్చి.. మంత్రిగా తీసుకున్నారు. అయితే, ఆ ఐదేళ్లు బాగానే ఉన్నా.. ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. గత ఏడాది ఎన్నికలలో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి నారాయణ ఓడిపోయారు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో నెల్లూరులో టీడీపీలో ఉండేందుకు కార్యకర్తలే ఇష్టపడడం లేదు. గత ఎన్నికల్లో ఓటమి చెందినప్పటి నుంచి ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దీంతో పసుపుజెండా పక్కనపెట్టి ఫ్యాన్ కిందకు చేరాలనుకుంటున్నారట. నెల్లూరు పొలిటికల్ సర్కిల్ లో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.తన ప్రధాన బిజినెస్ అయిన విద్యావ్యాపారాన్ని కాపాడుకోవడానికి నారాయణ వైసీపీ బాట పట్టేందుకు రెడీ అవుతున్నాడట. ఏపీలో జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి సర్కార్ విద్యను పటిష్టం చేస్తూ ప్రైవేటు విద్యను అణగదొక్కేస్తున్న క్రమంలో… కోట్లలో వ్యాపారం చేసే నారాయణ వంటి కార్పొరేట్ సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయనే చెప్పాలి. ఇదే విషయాన్ని కాస్త అటు ఇటుగా జగన్ అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు. ఈ క్రమంలో జగన్ పార్టీలోకి చేరితే ఈ బాధలు తప్పుతాయని నారాయణ కూడా భావించి రెడీ అయిపోతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే 2019 ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసిన నారాయణ తన ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నారాయణ కొంత పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో నారాయణ విద్యాసంస్థలున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో నారాయణ విద్యాసంస్థలను ప్రభుత్వాలు మూయించి వేస్తున్నాయి. నిబంధనలు పాటించడం లేదన్న కారణంతోనే నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేస్తున్నారు. విద్యాసంవత్సరం త్వరలో ప్రారంభం కానుండంటంతో నారాయణకు ఇది ఆందోళన కల్గించే విషయమే. దీంతో పాటు రాజధాని భూముల వ్యవహారంపై నారాయణపై ఇప్పటికే సిట్ కేసు నమోదు చేసింది. ఒక దళితుడిని మోసం చేశారన్న కేసులో నారాయణ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అందుకే గత కొంతకాలంగా నారాయణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు.నారాయణ ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. నారాయణ తొలుత బీజేపీలోకి వెళ్లాలని భావించారు. కానీ చంద్రబాబు సూచన మేరకు ఆగారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు అంతా తామే అయి చక్రం తిప్పిన నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలలో సోమిరెడ్డి ఒక్కరే యాక్టివ్ గా ఉన్నారు. తాను ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని నారాయణ తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద నారాయణ ఒకదఫా మంత్రిగా పనిచేసి ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో రాజకీయ వైరాగ్యాన్ని కొనితెచ్చుకున్నారు.ఇందులో భాగంగా ఇప్పటికే తన ప్రధాన అనుచరులను వైసీపీలో చేరాలని నారాయణ ఒత్తిడి చేస్తున్నారట. ఈ విషయంలో నారాయణ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారని, వెనక్కి తగ్గే ఆలోచనలు దాదాపు చేయకపోవచ్చని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.