నిమ్స్ ను గాలికొదిలేశారు
హైద్రాబాద్, జూన్ 16,
కోవిడ్- 19 ప్రపంచానికి నేర్పిన జాగ్రత్తలు ఏమిటి? అని ప్రశ్నిస్తే.. బొడ్డూడని బుడ్డోడి నుంచి పండు ముసలి దాకా ఠక్కున చెప్పే సమాధానాలు రెండే రెండు. ఒకటి ముక్కుకు మాస్కు. రెండు భౌతిక దూరం. ఇలాంటి ప్రాథమిక విషయాలు నిమ్స్ పెద్దలకు తెలీవా? ఒక వైపు లాకౌడౌన్ అనంతర కాలంలోనూ ఇంకా మెట్రో రైళ్లు.. సిటీ బస్సులు ప్రారంభం కాలేదు. నగరంలో ఎక్కడెక్కడ నుంచో ఆస్పత్రికి రప్పించాల్సిన నర్సులకు రవాణ సౌకర్యం కల్పించాల్సిన కనీస బాధ్యత నిమ్స్కు ఉంది. అది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దానికి వనరుల కొరత లేదు. అంతెందుకు? మొన్నటికి మొన్నటి దాకా అది 'ఎయిమ్స్'కు అప్పనంగా అప్పగించిన బీబీనగర్ క్యాంపస్లో ఓపీ సేవలు అందించింది. అప్పట్లో నగరం నుంచి వార్డ్బారు నుంచి సీనియర్ వైద్యుల దాకా ఉద్యోగులకు ఏసీ బస్సు సౌకర్యం ఏండ్ల తరబడి కల్పించింది. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది ఏమిటి? పటాన్చెరు నుంచి సనత్నగర్ ఈఎస్ఐ వయా నాచారం ఈఎస్ఐ దాకా నగరమంతా తిరిగే బస్సుల్లో నిమ్స్ సిస్టర్స్ను తరలిస్తున్నారు. అందులో ఏమైనా సౌకర్యం ఉందా? అంటే అదీ లేదు. ధర్నాలు చేసే ఉద్యమకారులను పోలీసులు డీసీఎం వాహనాల్లో కుక్కినట్టు.. సంతకు గొర్రెలను టాటా ఏస్ల్లో తరలిస్తున్న దాని కన్నా ఘోరంగా వారిని తరలిస్తున్నారు. ఇక భౌతిక దూరం మాటేమిటి? స్వయంగా ఘనత వహించిన నిమ్స్కు భౌతిక దూరం పాటించే విషయంలో ఉన్న 'అంకిత భావం' అది.నిమ్స్ నర్సులు ఆ బస్సు ఎక్కేందుకు వస్తుంటే.. మిగతా ఆస్పత్రుల ఉద్యోగులు వారిని చూసి 'కదలి వస్తోన్న కరోనా'లా? అన్నట్టుగా వణికిపోతున్నారు. ఆ పరిస్థితిని మాటల్లో వర్ణించలే మనీ.. ఆ అవమానం కన్నా ఉద్యోగం వదులు కోవడం మేలని.. కానీ, కాలే కడుపు తమతో ఆ సాహసం చేయించడం లేదని పలువురు నర్సులు 'నవ తెలంగాణ'తో తమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్స్లో కరోనా తీవ్రత ఆ స్థాయిలో ఉంది మరిఅంతెందుకు ఆయన నిమ్స్లో ఒక ముఖ్య విభాగానికి అధిపతి. రోగులకు చికిత్సను అందించే విషయంలో ఆయన అంకితభావం ప్రశ్నించలేనిది. పేరుకు సూపర్ స్పెషాలిటీ ప్రొఫెసర్ అయినా మచ్చుకైనా ఆ అహంకారం ప్రదర్శించకుండా.. దేశంలో సూపర్ స్పెషాలిటీ సౌకర్యాల కన్నా ప్రాథమిక వైద్యం పెరగాలని వాదించే.. ఆశించే వ్యక్తి. ఆ దిశలో ప్రజలను.. ఏలికలను ఎడ్యుకేట్ చేసే రీతిలో ఆయన వ్యాసాలు రాస్తుంటారు కూడా. ఇటీవల కరోనా భయభ్రాంతులతో రాష్ట్ర ప్రజానీకం వణికిపోయిన తొలి దశలో వివిధ ఛానెళ్ల ద్వారా వారిలో మనో ధైర్యం కలిగించే ఎన్నో విషయాలను సరళంగా.. సూటిగా.. వేగంగా వివరించారు. రాష్ట్రంలో టీవీక్షకులకు చాలా దగ్గరయ్యారు. ఆయనకు కూడా తాజాగా కరోనా సోకింది. ఆయన సైతం చికిత్సను పొందుతున్నారు.కానీ, నిమ్స్ పాలకవర్గం దృష్టిలో నర్సులు 'దైవాంశ సంభూతులు' మరి! వారికి కరోనా సోకనే సోకదు. వారు పాజిటివ్ వ్యక్తులను ముట్టుకొని చికిత్స చేసినా.. వారికి సోకదు. ఇక వారికి ఎన్- 95 మాస్కులు ఎందుకు? వైరస్ వారికి అంటదు కదా? అన్న రీతిలో నిమ్స్ మొండి వ్యవహారం సాగుతోంది. ప్రశ్నిస్తే.. అంత సాహసమే?