లక్ష కల్లాలు ఏర్పాటే లక్ష్యం
హైదరాబాద్ జూన్ 16
ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారంనాడు జిల్లా కలెక్టర్లతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశానికి ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ, నైరుతి రుతువపనాల సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ రంగానికి ఊతమివ్వాల్సిన సమయం దగ్గరపడడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో వ్యవసాయ రంగంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో పల్లెలన్నీ బాగుండాలని, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతులకు అవసరమైన ప్రణాళిక రచించాలని స్పష్టం చేశారు.మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు వేసే విధంగా ప్రోత్సహించాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ నియంత్రిత సాగుపై జిల్లా కలెక్టర్లతో మరింత విస్తృతంగా చర్చించారు. రైతు బంధు పథకం కింద రైతులకు అందాల్సిన సాయం పది రోజుల్లో పూర్తి చేయాలని అయన కోరారు. ఈ ఏడాది రైతుల భూముల్లో లక్ష కల్లాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. రెండు నెలల్లోగా అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లోగా రైతు వేదికలు పూర్తి చేయాలని పేర్కొన్నారు. నాలుగేళ్లలో గ్రామాల్లో పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామం ప్రతి రోజూ విధిగా శుభ్రం చేసుకోవాల్సిందేనని అయన అన్నారు