వైసీపీలో కుమ్ములాటల సంగతేంటీ
నెల్లూరు, జూన్ 17
జగన్ విపక్షంపై చూపిస్తున్న శ్రద్ధ సొంత పార్టీపై పెట్టడం లేదు. తెలుగుదేశం పార్టీ నేతల వరస అరెస్ట్ లతో దూకుడు చూపిస్తున్న జగన్ తన పార్టీని మాత్రం చక్కదిద్దుకోలేకపోతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. వైసీపీలో ఇటీవల కాలంలో అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. ఏపీలో అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుండటంతో వైసీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతూనే ఉంది. దీనిని తగ్గించే ప్రయత్నం మాత్రం పార్టీ అధినేత జగన్ చేయడం లేదు.ఒకవైపు పొగుడుతూనే…..జగన్ ను ఒకవైపు పొగుడుతారు. మరోవైపు పాలనను విమర్శిస్తారు. ఇది ఇటీవల వైసీపీలో ఫ్యాషన్ అయిపోయింది. అదేమంటే తాము అధికారులను తిట్టామే తప్ప జగన్ ను కాదంటారు. అయితే పాలనను తిడితే జగన్ ను తిట్టినట్లే కదా? అయినా సరే అధిష్టానం మాత్రం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతుంది. కనీసం పిలిచి మాట్లాడేందుకు కూడా జగన్ ఇష్టపడటం లేదు. దీంతో విపక్ష నేతల అరెస్ట్ లపై పెట్టే శ్రద్ధ సొంత పార్టీపై చూపడం లేదంటున్నారు.సీనియర్ నేతలు పాలనను తప్ప పడుతున్నారు. ఆనం రామనారాయణరెెడ్డి, ధర్మాన ప్రసాదరావులు లేవనెత్తిన ప్రశ్నలకు కనీసం సమాధానం దొరకలేదు. ఇసుక కొరతపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వస్తుండటంతో హడావిడిగా జగన్ సమీక్ష చేసి ఇసుక కొరతను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందీ తెలుసుకునే ప్రయత్నం జగన్ చేయలేదనే చెప్పాలి.జగన్ కేవలం అధికారులపైనే ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తుంది. పార్టీ పరంగా కొందరు మాత్రమే జగన్ కు దగ్గరగా ఉన్నారు. వీరు వాస్తవ విషయాలను జగన్ దృష్టికి తీసుకెళ్లలేదు. ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది పాలనపైన, విధానాలపైనా, నిర్ణయాలపైనా విమర్శలు చేస్తున్నా జగన్ పట్టించుకోకపోవడానికి కారణాలేంటన్న చర్చ పార్టీలో జరుగుతోంది. కనీసం తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడేందుకు కూడా జగన్ ఇష్టపడలేదు. అయితే ఇదే పంథా కొనసాగితే భవిష్యత్ లో పార్టీలో మరింత అసంతృప్తులు తలెత్తే అవకాశముందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.