స్టెరాయిడ్ డ్రగ్ తో కరోనా కంట్రోల్
న్యూఢిల్లీ, జూన్ 17
మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకూ 4.4 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. భారత్లో కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య పది వేలకు చేరువలో ఉంది. ఈ మహమ్మారి కారణంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ తదితర దేశాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ వైరస్ను అరికట్టడానికి తగిన ఔషధం, వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా మరణాలను తగ్గించగల ఔషధాన్ని పరిశోధకులు గుర్తించారు.జనరిక్ స్టెరాయిడ్ డ్రగ్ అయిన డెక్సామెతాసోన్ను తక్కువ మోతాదులో కరోనా పేషెంట్లకు ఇవ్వడం వల్ల మరణాల ముప్పు మూడో వంతు తగ్గుతున్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమించిన వారిలో ఈ ఔషధం మెరుగైన పనితీరు కనబరుస్తోందని యూకేలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైంది.కరోనా విషయంలో ఇదో గొప్ప ముందడుగుగా పరిశోధకులు అభివర్ణించారు. ఈ ఔషధం వాడటం వల్ల బాధితులు కోలుకుంటున్న తీరు బాగుందని కితాబిచ్చారు. వెంటిలేటర్ మీదున్న లేదా ఆక్సిజన్ సహాయం అవసరమైన కరోనా పేషెంట్లకు డెక్సామిథాసోన్ ఔషధాన్ని ఇవ్వడం వల్ల ప్రాణాలను కాపాడొచ్చని... ఇది చౌక ధరలో అందుబాటులో ఉందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్టిన్ ల్యాండ్రీ తెలిపారు. కరోనా మరణాల రేటును తగ్గించే ఔషధం ఇదొక్కటేనని, మరణించే ముప్పును ఇది గణనీయంగా తగ్గిస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న పీటర్ హార్బీ తెలిపారు.