మండలిలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం
తాడేపల్లి జూన్18
ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన కీలక బిల్లులు మండలిలో అడ్డుకొని తెలుగుదేశం పార్టీ శునకానందం పొందుతుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. మండలిలో అంగబలం ఉందని టీడీపీ ఇష్టారీతిగా ప్రవర్తించిందన్నారు. నారా లోకేష్ చౌదరి ప్రోత్సాహంతోనే టీడీపీ సభ్యులు దీపక్రెడ్డి, బీద రవిచంద్ర తనపై, మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్పై దాడి చేశారని మండిపడ్డారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ సభలో ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు లోకేష్ దాడికి తెగబడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్ర వ్యూహం ప్రకారమే సభలో టీడీపీ సభ్యులు గుండాలుగా, రౌడీలుగా ప్రవర్తించారని మండిపడ్డారు. ప్రజా కోర్టులో చంద్రబాబు ఎప్పటికీ దోషిగా మిగిలిపోతారని, రానున్న స్థానిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. తనపై, మంత్రులు కన్నబాబు, అనిల్ పై టీడీపీ సభ్యులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు తీరు అసెంబ్లీలో ఒక రకంగా, మండలిలో ఒక రకంగా ఉంది. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఎందుకు చర్చకు రాలేదు. గవర్నర్ ప్రసంగాన్ని కూడా టీడీపీ బహిష్కరించింది. మండలిలో అంగబలం ఉందని ఇష్టారీతిగా ప్రవర్తించారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గా ఉన్న వ్యక్తులు ఆ సీట్లో కూర్చున్నప్పుడు ప్రభుత్వ బిల్లులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. గతంలో చైర్మన్ నా విచక్షణాధికారం అని చెప్పి రూల్స్కు విరుద్ధంగా ప్రవర్తించారు. డిప్యూటీ చైర్మన్ కూడా నిన్న అదే రీతిలో ప్రవర్తించారని విమర్శించారు.