2024 కొత్త స్ట్రాటజీతో టీడీపీ
గుంటూరు, జూన్ 19
చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు చివరివి. ఇది అందరికీ తెలిసిన విషయమే. 2004, 2009 ఎన్నికల్లో చంద్రబాబు వరసగా ఓటమి పాలయినా 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అప్పుడు వయసు ఉంది. ఆయన నాయకత్వంపై నమ్మకం ఉంది. జగన్ పట్ల ఎవరికీ అంచనాలు కూడా లేవు. దీంతో పాటు మోదీ, పవన్ కల్యాణ్ మద్దతుతో చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగలిగారు. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు దారుణ ఓటమిని మూటగట్టుకున్నారు.2024 ఎన్నికలు మాత్రం చంద్రబాబు నాయకత్వానికి పరీక్ష. ఒకవైపు జగన్ బలంగా ఉండటం. మరో వైపు పార్టీ పూర్తిగా నిస్తేజంలోకి వెళ్లడంతో వచ్చే ఎన్నికల్లో కూడా గెలవకుంటే ఇక పార్టీ కార్యాలయానికి తాళం వేయకతప్పదు. అయితే నాలుగేళ్లలో తనకు కలసి వస్తుందన్న ఆశాభావంలో చంద్రబాబు ఉన్నారు. ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత జగన్ పై వెల్లువలా ఉందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.చంద్రబాబు అంచనా ప్రకారం ఇప్పటికే పదిశాతం మంది జగన్ పాలన పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో మరో పదిశాతం మంది ఖచ్చితంగా జగన్ కు వ్యతిరేకమవుతారు. అదే తనకు శ్రీరామరక్ష అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా మేధావులు, తటస్థులలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కన్పిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమంటున్నారు. గత ఎన్నికల్లో జగన్ కు వచ్చిన యాభై శాతం ఓట్లలో పది శాతం చిల్లుబడిందని అంటున్నారు.అందుకే చంద్రబాబు వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యేక స్ట్రాటజీతో వెళ్లాలని భావిస్తున్నారు. ప్రధానంగా రైతులు, యువతను ఆయన ప్రధానంగా ఎంచుకుంటున్నారు. మద్యపాన నిషేధం విషయంలోనూ స్పష్టమైన వైఖరిని తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. లేకుంటే మహిళల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఫీడ్ బ్యాక్ రావడంతో ఆయన నిషేధం వైపే మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు జరిగిన ఏడాది తర్వాత చంద్రబాబు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే అంతా సిద్ధం చేస్తున్నారు. పార్టీ నేతలు సయితం ఇకపై రోజూ ప్రభుత్వ పనితీరుపై మాట్లాడాలని ఎంపిక చేసిన నేతలను ఆదేశించినట్లు తెలిసింది.