టీడీపీలో ప్రక్షాళన తప్పదా...
విజయవాడ, జూన్ 19,
టీడీపీలో ప్రక్షాళన జరగాలా ? నాయకుల మధ్య తీవ్ర విభేదాలు కనిపిస్తున్నాయా ? రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి మరింత దిగ జారుతుందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన గద్దె బాబూరావు.. ఇదే తరహా వ్యా ఖ్యలు కుమ్మరించారు. అధినేత చంద్రబాబుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో క్షేత్రస్థాయి పరిస్థితిని ఎవరూ పట్టిం చుకోవడం లేదన్నారు. అంతేకాదు, చంద్రబాబుకు అన్నీ తెలిసి కూడా నాటకం ఆడుతున్నారని, ఇలా అయితే, పార్టీ ఉంటుందా ? అని కూడా ప్రశ్నించారు. తాము ఎన్నోఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామని, కానీ, తమకు, తమకు విలువ లేకుండా పోయిందని అన్నారు. ఈ పరిస్థితిని చంద్రబాబు మారాల్సిన అవసరం ఉందని… అలాగే పార్టీని కూడా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.కేవలం పార్టీలో కొందరికే పదవులు అనే ధోరణి ఇంకానా ? అని పరోక్షంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజును ఉద్దేశించి బాబూరావు వ్యాఖ్యలు సంధించారు. అయితే, ఇలాంటి ఆరోపణలు కేవలం బాబూరావు మాత్రమే పరిమితం కాలేదు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నాం.. మాకు అధినేత విలువ ఇస్తున్నారా? అంటూ.. మూడేళ్ల కిందట 2017లో సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి సహా ధూళిపాళ్ల నరేంద్రలు చేసిన ప్రకటనలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇక, ఇప్పటికీ పార్టీలో ఇలాంటి పరిస్థితే ఉందన్నది సీనియర్ల మాట. ఈ తరహా రగడే ఏడాది కిందట పార్టీలో ఏర్పడింది.గతేడాది ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ.. మాజీ మంత్రి అయిన దేవినేని ఉమకు ప్రాధాన్యం ఇస్తున్నారని అలిగిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర రగడ సృష్టించిన విషయం తెలిసిందే. ఇక్కడే అసలు సమస్య వస్తోంది. ఎన్నికల్లో గెలిచిందే 23 మంది… వీళ్లను పక్కన పెట్టి ఓడిన నేతలకు బాబు ఎందుకు ప్రయార్టీ ఇస్తున్నారని గెలిచిన వాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం పార్టీ వీడారు. అదే సమయంలో యువతకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పటికీ.. తన కుమారుడికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదని ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ఇటీవల అనధికార వ్యాఖ్యలు చేయడం కూడా పార్టీలో చర్చకు వచ్చింది.ఇక, అనంతపురం నుంచి అనకాపల్లి వరకు కూడా ఇలాంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. మరోపక్క, పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా. చంద్రబాబు ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా.. పట్టించుకునేవారు, ఇది తమదే అనే భావన ఉన్నవారు కూడా కరువయ్యారు. ఎక్కడికక్కడ, ఎవరికివారు.. తమకు కాదులే అనే ధోరణి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ ఏడాదిగా ఒంటరిగానే ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటీవల ముగిసిన మహానాడులోనూ ఇదే విషయంపై చర్చ సాగింది. దీంతో ప్రక్షాళనకు ఇదే సరైన సమయం అని సీనియర్లు మరోసారి వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ప్రక్షాళనకు సమయం వచ్చిందని అన్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.