కరోనాతో మృతులు భారత్లో మహిళలే ఎక్కువ
హైదరాబాద్ జూన్ 22,
ప్రపంచ అంతా ఒకటైతే .. మన దేశం మాత్రం మరోలా ఉంది. చాలా వరకు ప్రపంచదేశాల్లో కోవిడ్19 వల్ల పురుషులు ఎక్కువ శాతం చనిపోతున్నారు. ఇటలీ, చైనా, అమెరికా లాంటి దేశాల్లో పురుషులకే ఎక్కువ స్థాయిలో కరోనా వైరస్ సంక్రమించింది. మరణాల్లోనూ పురుషుల సంఖ్యే అధికంగా ఉన్నది. కానీ భారత్లో మాత్రం దీనికి భిన్నంగా మరణాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కరోనా మరణాలపై స్త్రీ, పురుషుల తేడాను స్టడీ చేసినట్లు జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్బర్గ్ శాస్త్రవేత్త సబ్రా క్లెన్ తెలిపారు. భారత్లో ఎక్కువ శాతం మంది పురుషులకు వైరస్ సంక్రమిస్తున్నదని, కానీ మరణాల్లో మాత్రం ఎక్కువ శాతం మహిళలే ఉంటున్నారని ఆ స్టడీలో వెల్లడించారు. మే 20వ తేదీ వరకు జరిగిన పరిణామాలను జాన్స్ హాప్కిన్స్ గ్రూపు స్టడీ చేసింది. దాంట్లో భారత్లో 3.3 శాతం మహిళలు వైరస్ సంక్రమణతో మరణిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇక పురుషుల్లో మరణాలు రేటు కేవలం 2.9 శాతం ఉన్నట్లు పేర్కొన్నారు. 40 నుంచి 49 ఏళ్ల ఏజ్ గ్రూపులో.. వైరస్ సంక్రమించిన మహిళల్లో 3.2 శాతం మంది మరణించారు. అదే పురుషుల్లో 2.1 శాతం మరణాలు ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు. 5 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయసులో ఆడవాళ్లు మాత్రమే చనిపోయినట్లు నిర్ధారించారు.