రెండు పదవులు.. ఇరవై మంది పోటీ
విజయవాడ, జూన్ 23,
రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సిఎం పిల్లి సుభాష్చంద్రబోస్, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తాజాగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక అయ్యారు. దీంతో వారిద్దరు నిర్వహిస్తున్న మంత్రిత్వశాఖలు ఖాళీ అవడంతో వాటిని సాధ్యమైనంత త్వరగా భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఆ రెండు శాఖలతో పాటు, మరో రెండు స్థానాలను కూడా భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో వైసిపిలో ఒక్కసారిగా పదవుల పోటీ ప్రారంభమైంది. వాస్తవానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన సమయంలో రెండన్నర ఏళ్ల తరువాత మంత్రివర్గాన్ని విస్తరిస్తానని జగన్మోహన్రెడ్డి చెప్పారు. అయితే, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ స్థానాల వరకు సాధ్యమైనంత త్వరగా భర్తీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. విస్తరణ జరిగితే తక్కువ మందికే అవకాశం ఉంటుందని భావిస్తున్నప్పటికీ ఆశావాహులు మాత్రం పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో తూర్పు గోదావరి జిల్లా ముమ్మడి వరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్కుమార్ (సతీష్), శ్రీకాకుళం జిల్లా నుంచి పలాస ఎ మ్మెల్యే సీదిరి అప్పలరాజు, గుంటూరు జిల్లా నుంచి మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో పాటు మరో ఇద్దరు నేతలు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఖాళీ అవుతున్న రెండు మంత్రిపదవులు నిర్వహిస్తున్న వారు బిసి వర్గానికి చెందిన వారు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు దక్కవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్కు దాదాపుగా బెర్తు ఖాయమని వైసిపి వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు మంత్రుల శాఖలు కూడా పెద్దఎత్తున మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఏడాది పాలనలో చేసిన పని ప్రాతిపదికగా ఈ శాఖల మార్పు ఉండే అవకాశం ఉంది.టిడిపి ఎ మ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి ఎవరిని బరిలోకి దింపుతారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఆ స్థానానికి వైసిపి నుండి ఎన్నిక కావడం లాంఛనప్రాయమే! ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో అనేక మందికి మండలిలో సభ్యునిగా అవకాశమిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ప్రధానంగా గుంటూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్కు మండలి సభ్యునిగా ఎంపికతో పాటు కేబినెట్లో స్థానం కల్పిస్తామని హామినిచ్చినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. ఆ మాట ప్రకారం మర్రి రాజశేఖర్కు మండలి సభ్యునిగా అవకాశం ఇస్తారా లేక ఇతరులను బరిలోకి దింపుతారా అన్నది చూడాల్సిఉంది.ః