కాంగ్రెస్ గెలుపు ఖాయం
రాజమండ్రి జూన్ 23
జన్మభూమి కమిటీలు చంద్రబాబుని ముంచినట్లు.. వాలంటీర్లే జగన్ని ముంచేస్తారని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ జోస్యం చెప్పారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో అసలు పరిపాలనే లేదని విమర్శించారు.తూర్పుగోదావరి జిల్లా రాజమహేంధ్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ... జగన్ ప్రభుత్వం అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు చేపట్టడం సరికాదని హితవు పలికారు. జగన్కి సమర్థత ఉంటే రాష్ట్ర ఆదాయం పెంచి ఇంటికి లక్ష రూపాయలు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడబెట్టిన ఆస్తులను జగన్ ప్రభుత్వం అమ్మేస్తోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై చేతులెత్తేశాయని వ్యాఖ్యానించారు. ప్రజలే ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని విజ్ఞప్తి చేశారు. చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగిస్తే కరోనా పోతుందన్న బీజేపీ భక్తులు ఏమయ్యారు? అని నిలదీశారు. బీజేపీ, వైసీపీలు ఒక్కటేనని అభిప్రాయపడ్డారు. కాపుల రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం పెట్రోల్ రేట్లు పెంచి జనాన్ని పిండుకుంటుందని శైలజానాథ్ మండిపడ్డారు.