వర్ల అడ్డంగా బుక్కయ్యారా...
విజయవాడ, జూన్ 24,
రాజకీయాల్లో ఎప్పుడూ.. పైచేయి సాధిస్తామంటే కుదిరే పనికాదు. ఎప్పుడు తగ్గాలో.. ఎప్పుడు మొగ్గాలో తెలిస్తేనే రాజకీయాల్లో ప్రభావం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే, టీడీపీ అధినేత, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మాత్రం ఇంకా ఈ విషయంలో ఎందుకో ముందుచూపుతో వ్యవహరించలేక పోతున్నారు. వైసీపీ అన్నా.. సీఎం జగన్ అన్నా.. ఆయనలో అక్కసు పెరిగిపోతోంది. ప్రజా తీర్పును చంద్రబాబు ఎందుకో జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలోనే అడుగడుగునా ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నారు.. తాను కూడా ఆయా ఇబ్బందుల్లో కోరి కోరి కూలబడుతూనే ఉన్నారు.రాజ్యభ ఎన్నికల్లో చంద్రబాబు పట్టుబట్టి మరీ పోటీకి నిలబెట్టారు. పోనీ.. ఆ నిలబెట్టేదేదో.. ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకుడిని నిలబెట్టడా.. రాజకీయంగా చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యను నిలబెట్టారు. వాస్తవానికి ఏపీకి నాలుగు రాజ్యసభ సీట్లు దక్కాయి. వీటిలో గెలిచేందుకు ఒక్కొక్కరికీ 35 ఓట్లు పడాలి. ఈ విషయంలో పక్కా క్లారిటీతో అధికార పార్టీ వైసీపీ వ్యవహరించింది. ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక రెడ్డి సామాజిక వర్గం సహా ఇద్దరు బీసీలకు అవకాశం ఇచ్చింది. అదే సమయంలో అంబానీ సలహాదారు పరిమళ్ నత్వానీకి కూడా జగన్ అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఎంతో కీలకంగా వ్యవహరించారు.అధికార పార్టీ వైసీపీకి బలం ఎక్కువగా ఉండడంతో ఎట్టిపరిస్థితిలోనూ ఆ పార్టీ సభ్యులు విజయం సాధిస్తారనే విషయం చంద్రబా బుకు తెలిసి కూడా ఆయన పోయి పోయి ఎస్సీ వర్గానికి చెందిన వర్లను రంగంలోకి దింపారు. అదే సమయంలో పార్టీలో విప్ జారీ చేశారు. సభ్యులు అందరూ విప్కు అనుకూలంగా వ్యవహరించాలని ఆదేశాలు పంపారు. ఇంతా చేస్తే.. విప్ అమలైనా.. వర్లకు కనీసం 17 ఓట్లు కూడా పడ్డాయని అంటున్నారు. దీనికి కారణం.. పార్టీతో విభేదించిన ఎమ్మెల్యేలలో ముగ్గురు విప్ కు అనుకూలంగా వచ్చి ఓటేసినా.. తప్పుగా వేశారు.ఈ ముగ్గురూ విప్ జారీ చేసిన నేపథ్యంలో ఓటు టీడీపీకే వేసినా.. చెల్లుబాటు కాని రీతిలో వేశారు. ఇక, మరో ఇద్దరు డుమ్మా కొట్టారు. ఏకైక మహిళా ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ ఓటు చెల్లుబాటు కాలేదు. దీనిని బట్టి చంద్రబాబు ఏం సాధించారో ఆయనకే తెలియాలి. మరో విచిత్రం ఏంటంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు వర్లకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పడంతో అన్ని ఛానెల్స్లో స్క్రోలింగ్లు కూడా వచ్చాయి. వర్ల ఎంతో ఉత్సాహంతో తాడేపల్లి బయలు దేరారు. విజయవాడ కనకదుర్గ వారధి దాటాక అసలు కథ మొదలైంది. అప్పుడు సడెన్గా కనకమేడల ఎంట్రీ ఇవ్వడం.. ఢిల్లీలో లాబీయింగ్ కోసం అంటూ కమ్మ కోటాను తెలివిగా నింపేశారు.అప్పుడు పార్టీ ఖచ్చితంగా గెలిచే పరిస్థితి. అప్పుడు వర్లకు నామినేషన్ వేసేందుకు రమ్మని పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేయించి సీటు ఇవ్వలేదు. నేడు ఓడిపోయే సీట్లో ఆయన్ను నిలబెట్టి ఆయన్ను బద్నాం చేశారు. మొన్ని ఎన్నికలకు ముందు కూడా ఆయనకు సీటు ఇవ్వకుండా పార్టీ మారి వచ్చిన ఉప్పులేటి కల్పనకు ఇవ్వగా ఆమె చిత్తుగా ఓడిపోయారు. ఇక తాజా పరిణమాలతో వర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా చేయడం మినహా చంద్రబాబు ఏం సాధించినట్టు..? ఎస్సీ నేతను బరిలో నిలిపి ఓడించారనే చెడ్డపేరు తప్ప. అంటున్నారు పరిశీలకులు. మరో ట్విస్ట్ ఏంటంటే టీడీపీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేసిన సీట్లో కూడా ఇప్పుడు పోటీకి పెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట.