ఢిల్లీలో ప్రపంచ పెద్ద కరోనా ఆస్పత్రి
న్యూఢిల్లీ, జూన్ 24
సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల్లో మనది పైచేయి అయినా కాకపోయినా ఒక విషయంలో మాత్రం చైనాను భారత్ మించిపోనుంది. దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపు తప్పడంతో వేలాదిమంది పాజిటివ్ రోగుల చికిత్స నిమిత్తం ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రిని ఢిల్లీలో అతి తక్కువ సమయంలో నిర్మించారు. ఈ ఆసుపత్రి నిర్మాణంలో ఏ ప్రమాణంలో చూసినా మనం చైనాను మించిపోయాం అనే చెప్పాలి.ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి రెండు రోజుల్లో దక్షిణ ఢిల్లీలో అందుబాటులోకి రానుంది. 10,200 బెడ్ల సామర్థ్యం గల ఈ ఆస్పత్రి 10 రోజుల్లో చైనా నిర్మించిన కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రి కంటే పదింతలు పెద్దది కావడం విశేషం.
చత్తర్పూర్లోని ఆధ్యాత్మిక క్షేత్రం రాధాస్వామి సత్సంగ్ బియాస్ కాంప్లెక్స్నే ఆస్పత్రి మార్చి కోవిడ్ బాధితులకు సేవలందించనున్నారు. 800 మంది జనరల్ డాక్టర్లు, 70 మంది స్పెషలిస్టులు, 1400 మంది నర్సులు ఇక్కడ పని చేయనున్నారు. హోంమంత్రి అమిత్ షా ఆదేశాలమేరకు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ విభాగానికి చెందిన వైద్య సిబ్బంది ఈ ఆస్పత్రిలో సేవలందించనున్నారు.కాగా, 15 ఫుట్బాల్ మైదానాలతో సమానమైన ఈ ప్రత్యేక ఆస్పత్రికి సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్ అని నామకరణం చేశారు. మరోవైపు కోవిడ్ రోగులకు ఆహారాన్ని అందిస్తామని రాధాస్వామి సత్సంగ్ చెప్పింది. హోంమంత్రి అమిత్ షా గురువారం సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించనున్నారు. తొలుత 2000 బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. జూలై 3 వరకు పూర్తి స్థాయిలో బెడ్లు అందుబాటులో ఉంటాయని ఢిల్లీ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. కాగా, 62 వేల కరోనా కేసులతో ఢిల్లీ దేశంలో రెండో స్థానంలో ఉంది. నెలాఖరు వరకు ఢిల్లీలో కేసుల సంఖ్య లక్షకు చేరుకుంటుందని, 15 వేల బెడ్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కేంద్రం సాయం కోరింది.జూన్ నెల చివరినాటికి ఢిల్లీలో కోవిడ్ రోగుల సంఖ్య లక్షకు చేరుకుంటుందని భావిస్తున్న నేపథ్యంలో కనీసం 15 వేల పడకలు అవసరమవుతాయని అంచనా వేశారు. త్వరలో ప్రారంభం కానున్న 10,200 పడకల కరోనా ఆసుపత్రి రోగుల చికిత్సకు గణనీయంగా తోడ్పడుతుందని నిపుణుల వ్యాఖ్య.