శాసన మండలి రాష్ట్రాలలో శాశ్వత సభగా ఉండాలి
- యనమల రామకృష్ణుడు
విజయవాడ జూన్ 24
ప్రజాస్వామ్యం శిథిలావస్థకు చేరుతున్న తరుణంలో రాష్ట్రాలలో ఎగువ సభ తప్పనిసరి. దిగువ సభలో అధికార పార్టీ ప్రజాభీష్టానికి విరుద్దంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగేలా తీసుకున్న నిర్ణయాలను ఎగువ సభ క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిని తిరిగి మళ్లీ దిగువ సభకు పున: పరిశీలనకు పంపుతుందని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ మేరకు అయన ఒక ప్రకటన విడుదల చేసారు.ఎగువ సభకు వీటో పవర్ ఉండదుగాని, ప్రజలను, దిగువ సభను చైతన్యపరిచేందుకు ఎగువ సభ దోహదం చేస్తుంది. నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవడానికి, విస్తృత ప్రజాభిప్రాయానికి ఎగువసభ పెద్దపీట వేస్తుంది. ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకే ఈ 2బిల్లుల(మూడు రాజధానుల బిల్లు, సిఆర్ డిఏ రద్దు బిల్లు)ను శాసన మండలి సెలెక్ట్ కమిటికి ఎగువ సభ పంపింది కానీ దానికి రాష్ట్ర ప్రభుత్వమే సిద్దంగా లేకపోవడం గమనార్హం. అదే ఎగువ సభ అనేదే లేకపోతే, ప్రజా ప్రయోజనాలకు ఉండాల్సిన ప్రాధాన్యత ప్రజాస్వామ్యంలో కొరవడుతుంది. కేంద్రంలో రాజ్యసభ ఎలాగో రాష్ట్రంలో శాసన మండలి అదేవిధంగా పనిచేస్తుంది. శాసన నిర్మాణంలో, ప్రజాస్వామ్యంలోనూ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష. బొటాబొటి మెజారిటి ఉన్న ప్రభుత్వంగాని, లేదా మైనారిటి ప్రభుత్వంగాని దేశంలో, రాష్ట్రాలలో ప్రజా ప్రయోజనాలను కాలరాసే ధైర్యం చేయలేవని అయన అన్నారు.రాజ్యసభ తరహాలోనే రాష్ట్రాలలో శాసన మండళ్లు కూడా శాశ్వతంగా కొనసాగాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి అవసరమైన సవరణలు తీసుకురావాలి. రాజ్యసభ శాశ్వత సభగా ఉన్నప్పుడు శాసనమండలి ఎందుకు ఉండకూడదు..? నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, ప్రజాస్వామ్య నియంతలుగా మారితే, ప్రజాభిప్రాయాలను ప్రతిబింబించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎగువసభ తప్పకుండా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. అలాంటి ఎగువసభను అడ్డుగోడగా పేర్కొనడం సరైందికాదు..రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను పరిరక్షించే రాజ్యాంగ సంస్థ శాసన మండలి. దిగువ సభలో అత్యధికులు కొన్నిమార్లు ప్రజాభిప్రాయాన్ని తోసిరాజన్నప్పుడు (ఉదాహరణకు ఇంగ్లీషు మీడియం బిల్లు లేదా అమరావతి రాజధాని బిల్లు) ఎగువ సభ వాటిని పరిశీలించి విస్తృత ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తుంది. రాజ్యసభ సభ్యులను పార్లమెంటు ఎన్నుకుంటుంది, కొందరిని రాష్ట్రపతి ఎంపిక చేస్తారు. అదేవిధంగా శాసన మండలి సభ్యులను ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఎన్నుకుంటారు, కొందరిని గవర్నర్ ఎంపిక చేస్తారు. వారందరూ సరైన పరిజ్ఞానం, అనుభవం ఉండటమే కాకుండా అన్నివర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. దిగువ సభకు ఎన్నిక కాలేనివారు ఎగువ సభకు ఎంపికై ఆయా వర్గాల ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబిస్తారు. దిగువ సభలో చేపట్టిన తొందరపాటు చర్యలను, దుందుడుకు నిర్ణయాలను నిరోధిస్తారు. దిగువ సభలో ఆధిక్యత చలాయించే నాయకుడి దయాదాక్షిణ్యాలపై ఎగువ సభ మనుగడ ఆధారపడి ఉండరాదని అన్నారు.