వివక్షకు తావు లేదు
అమరావతి జూన్ 24
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయ, మీ చల్లని దీవెనలతో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేయగలిగాను. ఈ 13 నెలలో కాలంలో 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైయస్సార్ కాపు నేస్తం పథకం ప్రారంభ సందర్బంగా అయన పలువురు లబ్దిదారులతో మాట్లాడారు. ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశాము. గొప్ప మార్పుతో ఈ 13 నెలల పాలన కొనసాగింది. ఎక్కడా వివక్షకు తావునివ్వలేదు. మనకు ఓటు వేయకపోయినా, అర్హత ఉంటే మంచి జరగాలని ఆరాటపడ్డాం. అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు చేశాము. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదు. ఇవాళ కాపు అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఈ ఏడాది ఎంత ఖర్చు చేశామని చూస్తే.. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వాహనమిత్ర, చేదోడు, విదేశీ విద్యా దీవెన, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా 23 లక్షలకు పైగా లబ్ధిదారులకు అక్షరాలా రూ.4770 కోట్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. బియ్యం కార్డు ఉంటే చాలు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఇప్పుడు రూ.15 వేల చొప్పున సహాయం. ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లింపు. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్ ఇన్కమ్బర్డ్ ఖాతాలో వేస్తున్నాం. ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే ఆందోళన చెందవద్దు. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా, ఎలా మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం ఇదని అన్నారు. అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. మీ పేరు లేకపోతే, మీకు అర్హత ఉంటే, వెంటనే దరఖాస్తు చేసుకోండి. – వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తాం. గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడండి. గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేసింది? చూడండి. ఏటా రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం 5 ఏళ్లలో, ఏటా సగటున రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.4770 కోట్లు కాపు కులస్తులకు ఇచ్చింది. దేవుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో మీకు ఇంకా మంచి చేయాలని భావిస్తున్నానని సీఎం అన్నారు.