చారిత్రకంగా, సాంస్కృతికంగా ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంలో ప్రముఖ వారసత్వ కట్టడాలను పునరుద్దరించి భావి తరాలకు అందించే బృహత్ ప్రణాళికలను రూపొందించి పకడ్బందిగా అమలు చేస్తోంది. జీహెచ్ఎంసీ ప్రధానంగా గత దశాబ్దంన్నర నుండి నత్తనడకన నడుస్తున్న చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ పనులను ముమ్మరంగా చేపట్టడమే కాకుండా చార్మినార్కు నాలుగు వైపులా ఉన్న చార్ కమాన్లను ఓల్డ్ సిటీకి ప్రత్యక ఆకర్షణగా ఉన్న చుడీబజార్, ముర్గీచౌక్, క్లాక్టవర్, జుల్ఫీకన్ కమాన్, మోజంజాహీ మార్కెట్లను పునరుద్దరించడం ద్వారా వాటికి పూర్వ వైభవం తేవడానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక నిధులను కేటాయించి పనులను చేపట్టింది. దీనిలో భాగంగా ఈ క్రింది హెరిటేజ్ కట్టడాల పునరునిర్మాణ పనులను ముమ్మరంగా చేపట్టారు.అంతర్జాతీయ పర్యాటక స్థలాల్లో ఒకటైన చార్మినార్తో పాటు పరిసర ప్రాంతాలను అభివృద్ది చేయడానికి చేపట్టిన చార్మినార్ పెడెస్ట్రేరియన్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2006 అక్టోబర్ మాసంలో రూ. 35.10కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం మొదలు పెట్టిన ఈ చార్మినార్ ప్రాజెక్ట్ పనులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా కె.టి.రామారావు పదవీబాధ్యతలు చేపట్టగానే అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. చార్మినార్ ఫెడెస్టేరియన్ ప్రాజెక్ట్ పనులపై సమీక్షించి, చార్మినార్లో మంత్రి కె.టి.ఆర్ స్వయంగా పర్యటించారు. మొత్తం రూ. 35.10కోట్ల వ్యయంతో చేపట్టే ఈ చార్మినార్ ప్రాజెక్ట్కు రూ. 12.28కోట్లు భారత ప్రభుత్వం అందిస్తుండగా రూ. 5.26కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ రూ. 17.55కోట్లు అందిస్తున్నాయి. చార్మినార్ బ్యూటిఫికేషన్, స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణ, మౌలిక సదుపాయల కల్పన, బ్యాటరీతో నడిచే వాహనాలు అందించడం తదితర పనులను చేపట్టడానికి రూ. 8,19కోట్లను ఎన్.టి.పి.సి కేటాయించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ పథకంలో భాగంగా ఈ నిధులను ఐకానిక్ ప్రాజెక్ట్ క్రింద చార్మినార్ అభివృద్దికి కేటాయించింది. వీటితో పాటు లాడ్ బజార్లో గజీబిజీగా ఉన్న దుకాణాల ముందు బాగాలు తొలగించి ఆకర్షనీయమైన ఎలివేషన్ కలిగేలా ముఖ్యంగా హైదరాబాద్ నిర్మాణ శైలీ ప్రతిబింబించేలా పనరునిర్మాణ చర్యలను చేపట్టారు.చార్మినార్ నుండి గుల్జార్ హౌస్ వరకు చేపట్టిన గ్రానైట్ పేవ్మెంట్ పనులు సర్దార్ మహాల్ మినహా పూర్తి అయ్యాయి. మదీన నుండి పత్తర్ఘట్టి మార్గంలో స్ట్రీట్ స్కేపింగ్ పనులు పూర్తయ్యాయి. చార్మినార్ పరసర ప్రాంతాల్లో సెంట్రల్ లైటింగ్ను గ్రానైట్ రాతిని అర్చిన అనంతరం పూర్తి చేస్థాయిలో చేపడుతారు. పత్తర్ఘట్టి, మదీన గుల్జార్హౌస్ మార్గాల్లో ఉన్న వారసత్వ కట్టడాల పరిరక్షణ పనులు పూర్తయ్యాయి.ఫ్లెక్స్ బ్యానర్లు, గజిబిజీగా ఉన్న హోర్డింగ్లు తొలగించడంతో గుల్జార్ హౌజ్ మార్గంలో ఉన్న హెరిటేజ్ భవనాలు స్పష్టంగా కనిపిస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
*దాదాపు 400 ఏళ్లకు పైగా ఉన్న చార్ కమాన్ల పునరుద్దరణ*
చార్మినార్ నిర్మాణం పూర్తి అయిన తదుపరి సంవత్సరం 1592 లో చార్మినార్ చుట్టూ నాలుగు కమాన్ లను నిర్మించారు. చార్ కమాన్, కాలీ కమాన్, మచిలీ కమాన్, షేర్ ఏ బాతుల్ కమాన్ అనే నాలుగు కమాన్లను 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు లో ఇండో పర్షియన్ పద్దతిలో నిర్మించారు. ఈ నాలుగు అత్యంత హుందాగా చార్మినార్తో పాటు హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈ నాలుగు కమాన్ల నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో కమాన్లపై ఫ్లెక్సీలు, విద్యుత్ వైర్లు, సైన్బోర్డులు, ఆక్రమణలతో ఉండి వాటి వైభవాన్ని కోల్పోయాయి.ఈ నాలుగు కమాన్లపై మొక్కలు మొలవడం, ట్రాఫిక్ వల్ల వచ్చే ధ్వని, వాయు కాలుష్యంతో కమాన్లు శోభను కోల్పోయాయి. చారిత్రక వారసత్వ సంపదగా గుర్తించిన ఈ చార్ కమాన్లను పునరుద్దరణకు ప్రత్యేకంగా 87లక్షల రూపాయలను జీహెచ్ఎంసీ కేటాయించింది. ఈ నిధులతో నాలుగు కమాన్ల ప్లాస్టరింగ్ పనులు, మరమ్మతులు, సాంప్రదాయక పద్దతిలో చార్కమాన్ల పునరుద్దరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పెచ్చులు ఊడిన ఈ కమాన్లకు మరమ్మతులు విచ్చలవిడిగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, మేక్లను తొలగించడం, చార్ కమాన్లపై ఏర్పాటు చేసిన షాపులను తొలగించడం తదితర పనులను చేపట్టారు. అక్టోబర్ 14వ తేదీన ప్రారంభమైన చార్కమాన్ల పునరుద్దరణ పనులు ఏప్రిల్ మాసాంతం వరకు పూర్తిచేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు కృషి చేస్తున్నారు.
*రూ. 60లక్షలతో ముర్గిచౌక్ క్లాక్టవర్ పునర్నిర్మాణం*
హైదరాబాద్ స్టేట్ ప్రధాన మంత్రిగా 1887 నుండి 1894 వరకు ప్రధాన మంత్రిగా ఉన్న పైగా వంశస్తుడైన నవాబ్ అస్మాన్ జా బహదూర్ చార్మినార్ సమీపంలో మహబూబ్ చౌక్ను చతురస్రం ఆకారంలో నిర్మించారు. ఈ చౌక్ మధ్యలో ఐదు అంతస్తుల క్లాక్ టవర్ను కూడా నిర్మించారు. నాలుగువైపులా నాలుగు పెద్ద గడియారాలతో టర్కీ నిర్మాణ శైలీలో 1892లోనిర్మించిన ఈ క్లాక్టవర్ పునరుద్దరణ పనులకు 60లక్షల రూపాయలను జీహెచ్ఎంసీ మంజూరు చేసింది. ఈ క్లాక్ టవర్ పునరుద్దరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
*ముర్గీచౌక్ మార్కెట్కు పూర్వవైభవం*
దాదాపు 125 సంవత్సరాల చరిత్ర కలిగిన ముర్గీ చౌక్కు ప్రపంచంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఈ ముర్గీ చౌక్లో దొరకని పక్షిజాతి లేదు. రానురాను జంతు, పక్షి ప్రియులకు ఆందోలనలతో కేవలం కోళ్లు, వన్యప్రాణి చట్టం పరిధిలోకి రాని కోళ్లు, బాతులు తదితర పక్షిజాతులను మాత్ీమే విక్రయిస్తున్నారు. ఈ ముర్గీచౌక్ను పునరుద్దరించడానికి ఇటీవలి రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డిలు శాసన సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ, పాషా ఖాద్రీలతో కలిసి ముర్గీచౌక్ను సందర్శించారు. అయితే ప్రస్తుతం ఉన్న ముర్గీచౌక్కు మరమ్మతులు చేయించి పూర్తిగా పటిష్టం చేయడానికి రూ. 5కోట్లు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న ముర్గీ చౌక్ మార్కెట్ను పూర్తిగా కూల్చి అదేమాదిరిగా తిరిగి నిర్మించడానికి రూ. 20కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ విషయంలో జె.ఎన్.టియుల సాంకేతిక పరమైన తగు సలహాలివ్వాల్సిందిగా జె.ఎన్.టి.యు సాంకేతిక కళాశాలను జీహెచ్ఎంసీ కోరింది.
మదినా నుండి గుల్జార్ హౌజ్ వరకు ఇరువైపులా ఉన్న మార్గాల్లో హోర్డింగ్లు, బ్యానర్లను పూర్తిగా తొలగించడమే కాకుండా హెరిటేజ్ కట్టడాల దుకాణాల ముందు చిందర వందరగా ఉన్న దుకాణాల పేరును తెలియజేసే సైన్ బోర్డులను జీహెచ్ఎంసీ తొలగించింది. ఈ మార్గంలో అన్ని వ్యాపార, వాణిజ్య, దుకాణాలకు ఒక మాదిరిగా ఉండే నేమ్ ప్లేట్లను ఏర్పాటు చేయమన్నారు.
*మోజంజాహీ మార్కెట్కు గత వైభవం*
సుప్రసిద్ద మోజంజాహీ మార్కెట్ పునరుద్దరణకు రూ. 10కోట్ల ప్రాథమిక అంచనాతో పునరుద్దరణ పనులను జీహెచ్ఎంసీ చేపట్టింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశాలతో ఈ పునరుద్దరణ బాధ్యతలను రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ చేపట్టారు. 1935లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రెండవ కుమారుడైన నవాబ్ మోజంజా బహదూర్ పేరుతో నిర్మించాడు. 1.77 ఎకరాల విస్తీర్ణంలో 120షాపులతో నిర్మించిన ఈ మార్కెట్ 1947 వరకు ప్రముఖ పాన్ బజార్గా ఉండేదని అప్పటి వారు అంటారు. ఇక్కడ దొరకని పాన్ వెరైటీలు ఉండవు. క్రమక్రమంగా పూలు, మటన్, బేకరీ, ఐస్క్రీమ్ షాపులకు ఇది ప్రసిద్దిగా మారింది. పాత బస్తీ, కొత్త బస్తీలకు నాంధిగా దీనిని నిర్మించారు. హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి, సిటీ కళాశాల మాదిరిగా మోజంజాహీ మార్కెట్ నిర్మాణ శైలీ ఉంటుంది. పూర్తిగా ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, బ్యానర్ల ఏర్పాటుతో పూర్వవైభవాన్ని కోల్పోయిన మోజంజాహీ మార్కెట్ను మూడు నెలల్లో పూర్తిస్థాయిలో పునరుద్దరించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించడంతో. ఈ మార్కెట్ పునరుద్దరణ పై ఇప్పటికే మార్కెట్లోని వ్యాపారస్తులు, చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద పరిరక్షణలు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్ ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగర చారిత్రక వారసత్వ నిర్మాణం కేశాలానికి ప్రతీకగా నిలిచిన మోజంజాహీ మార్కెట్ 87 ఏళ్ల నిర్మాణ అనంతరం పునరువైభవ కలుగనున్నందున చరిత్ర ప్రేమికులు, నగరవాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్ ఫౌంటెన్ను ఇటీవల జీహెచ్ఎంసీ పునరుద్దరించింది. మొత్తానికి నాలుగు వందల సంవత్లరాలకు పైబడ్డ హైదరాబాద్ నగరంలోని పురాతన వారసత్వ కోట్లకు తిరిగి పూర్వవైభవం తేవడానికి తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా చర్యలు చేటప్టడంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.