వరవరరావుకు మళ్లీ షాక్
హైద్రాబాద్, జూన్ 27,
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు ముంబయి కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ముంబయి కోర్టు తిరస్కరించింది. వరవరరావు అనారోగ్యంతో ఉన్నందున ఆయన బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయినా కోర్టు ఆయన వినతిని తోసిపుచ్చింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్ను తిరస్కరించింది.ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్లో వరవరరావును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు అతణ్ని మొదట మహారాష్ట్ర పుణెలోని ఎరవాడ జైలుకు తరలించారు. తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నేవీ ముంబయిలోని తలోజా జైలుకు మార్చారు. తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు చనిపోవడంతో వరవరరావు ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో వృద్ధుడైన తమ తండ్రి వరవరరావును జైలు నుంచి విడుదల చేయాలని ఆయన కుమార్తెలు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. అంతేకాక, మహారాష్ట్ర గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖలు కూడా రాశారు.