మాజీ ప్రధాని అంతరంగం : పీఠాధిపతి కాబోయి.. అనూహ్యంగా ప్రధాని పీఠమెక్కిన పీవీ.నర్సింహారావు.
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు... ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, అపర చాణుక్యుడు, రాజనీతిజ్ఞుడు... తెలుగు నిఘంటవులోని పదాలన్నీ ప్రోదిచేసి చెప్పినా ఆయన గురించి తక్కువే అవుతుంది. రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పాలనుకున్న సమయంలో అనూహ్యంగా దేశ ప్రధాని అయ్యారు. దేశం ఆర్ధిక పతనం అంచుకు చేరి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా పగ్గాలు చేపట్టి మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ల పాటూ పూర్తిగా నడపడం ఆయనకే చెల్లింది. అంతేకాదు, కుంటుపడిపోయిన ఆర్ధిక ప్రగతి చక్రాన్ని పట్టాలెక్కించి ప్రపంచ దేశాలతో ఔరా అనిపించుకున్నారు. దాదాపు భారతీయ భాషలన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించి, ప్రముఖ కవి విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయి పడగల నవలను హిందీలోకి సహ్రస్ ఫణి పేరుతో అనువదించిన బహుభాషా కోవిదుడు పీవీ.