ఏపీలో రీవెంజ్ పాలిటిక్స్...?
విజయవాడ, జూన్ 29,
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యర్థుల విషయంలో చాలా కఠినంగా ఉంటారని చెబుతారు. తన జోలికి వచ్చిన వారిని క్షమించే పరిస్థితి కూడా ఉండదంటారు. అయితే వ్యాపారాలు, వ్యక్తిగత విషయాల్లో అయితే ఇది బాగానే ఉంటుంది. కానీ రాజకీయాల్లో మాత్రం కఠినంగా ఉంటే ఎలా కుదురుతుంది? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. అంటే ఎప్పుడైనా ఎవరితోనైనా అవసరపడవచ్చు. అందుకు సమయం, సందర్భం ముందుగా ఊహించలేం. కానీ జగన్ మాత్రం తన శత్రువుల విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.ఇది రాజకీయంగా ఆయనకు కొంత ఇబ్బంది కల్గించే పరిణామమే. చంద్రబాబు, నారా లోకేష్ లు ఆరోపించినట్లు అచ్చెన్నాయుడును జగన్ పార్టీలోకి తీసుకోవాలనుకున్నారని, అందుకు యాభై కోట్లు ఇస్తానన్నరన్నదానిలో వాస్తవం అస్సలు ఉండదు. ఎందుకంటే జగన్ మనసు, వైఖరి తెలిసిన వాళ్లు ఎవరైనా అచ్చెన్నను పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేశారంటే నమ్మరు. అచ్చెన్న అధికారంలో ఉన్నప్పుడు తనను ఎన్ని మాటలందీ జగన్ మర్చిపోరు. తనపై సభలో ఎలా మాటల దాడికి దిగిందీ జగన్ విస్మరించరని ఒక వైసీపీ నేత అన్నారు. దీంతో పాటు ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్న అడ్డంగా దొరికిపోవడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా విచారణకు ఆదేశించి అరెస్ట్ చేయించారన్న టాక్ ఉంది.ఇక మరో నేత జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలోనూ జగన్ వైఖరి అంతేనని చెప్పక తప్పదు. జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పడు కనీస సంస్కారం లేకుండా జగన్ ను దూషించారు. మీడియా సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉన్నాయి. అలాంటి జేసీ సోదరులను జగన్ క్షమించే ప్రసక్తి లేదన్నది వాస్తవం. దీంతో పాటు నకిలీ ధృవపత్రాలు, ఫోర్జరీ సంతకాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి చిక్కడంతో జగన్ ఆయనకు ఊచలు చూపించక తప్పలేదంటారు.మరో నేత అయ్యన్న పాత్రుడు విషయంలోనూ అంతే. ఆయన నోరు పెద్దది చేసుకుని పడిపోతారు. ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. అయ్యన్న పాత్రుడు ఎప్పుడు దొరుకుతారా? అని వేచి ఉన్న వైసీపీ నేతలకు తాహసిల్దార్ ను దూషించిన కేసులో దొరికిపోాయరు. దీంతో ఆయనపై కేసు నమోదయింది. త్వరలోనే మరికొందరు నేతలపై కేసులు నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ అధికారంలో ఉన్నప్పుడు తనను వేధించిన, వెంటాడిన వారిని వదలిపెట్టే అవకాశం లేదన్న ప్రచారంతో టీడీపీలో భయాందోళనలు మొదలయ్యాయి.