పెట్రోల్ ధరల పెంపుపై రాష్ట్రపతికి ఎంపీ కోమటిరెడ్డి లేఖ
హైదరాబాద్ జూన్ 29
పెట్రోల్ ధరల పెంపుపై రాష్ట్రపతికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై 20 రోజులుగా వరుసగా పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరింత భారాన్ని మోపుతోందని తెలిపారు. కరోనా మహమ్మరితో ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయన్నారు. అధిక జనాభా కలిగిన మన దేశంలో పేద, మధ్య తరగతి, రైతు, ఉద్యోగ, చిరు వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఉపాధి లేక వలస కార్మికులు, పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని... ఇలాంటి సమయంలో ప్రజలకు ధరలు తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాల్సింది పోయి ధరలు పెంచడం దారుణమని లేఖలో పేర్కొన్నారు. ఇంత దుర్భర జీవితాన్ని ఎదురుకొంటున్న సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తోందని విమర్శించారు.అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే విచిత్రంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2014 క్రూడాయిల్ ధర 108 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ ధర లీటర్ రూ.71.40, డీజిల్ రూ.59.59 గా ఉందన్నారు. 2020 లో క్రూడాయిల్ ధర రూ.43.41 కి సుమారు 60 శాతం తగ్గితే సుమారు పెట్రోల్ లీటర్కి రూ.20.68 ఉండాలి కానీ రూ.82.96 ఉందని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం ఒక నియంతలా పాలిస్తోందని అన్నారు. ఇష్టానుసారంగా ఎక్సైజ్ పన్నులను పెంచుతూ పేద వాడి నడ్డివిరుస్తోందన్నానరు. ఆరు సంవత్సరాలుగా కేవలం ఎక్సైజ్ పన్నులు పెంచడం వల్ల సుమారు 18 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని, పేద ప్రజల రక్తాన్ని చార్జీల రూపంలో పిల్చిందని ఎంపీ కోమటిరెడ్డి లేఖలో పేర్కొన్నారు.