పోలీసుల పరుగులు
మైలవరం జూన్ 30
కృష్ణాజిల్లా మైలవరం మండలం లోని చండ్రగూడెం గ్రామంలో రైతులు రెవెన్యూ అధికారులు, పోలీసులను పరుగులు పెట్టించారు.తాము సాగు చేస్తున్న భూములు లాక్కుని ఇళ్ళ స్థలాల పంపిణీ చేస్తామంటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామంటూ రైతులు పురుగుమందు డబ్బా చేత పుచ్చుకుని తలాదిక్కూ పరిగెడుతుంటే వారిని ఆపడానికి మైలవరం తహశీల్దార్ రోహిణీ దేవి,ఎస్ఐ ఈశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది వాళ్ళ వెంట పరుగులు పెట్టారు.ప్రబుత్వ స్థలం కాబట్టి దాన్ని పేదలకిస్తామని తహశీల్దార్ స్థలాన్ని పరిశీలించి చదును చేయించడానికి వెళితే 30సంవత్సరాలుగా మేము సాగు చేసుకుంటున్నామని రైతులు అడ్డం తిరిగారు.దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.పత్రాలు లేకుండా ఇలా హడావుడి చేస్తే చర్యలు ఉంటాయని పోలీసులు నచ్చచెప్పడానికి ప్రయత్నించడంతో రైతులు పురుగుమందు డబ్బాలు పట్టుకుని చస్తామంటూ అధికారులను బెదిరించారు.వారిని ఆపేసరికి అటు పోలీసులు,ఇటు రెవెన్యూ అధికారులు నానా తంటాలు పడ్డారు.పరిస్థితి గందరగోళం గా మారడంతో ప్రస్తుతానికి పనులు ఆపి అధికారులు వెనక్కి వెళ్ళారు.