రేపు కేబినెట్
3 నుంచి 17 వరకు లాక్ డౌన్?
హైద్రాబాద్, జూన్ 30
తెలంగాణలో కరోనా కేసులు క్రమేపీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మరోమారు కట్టడి చేయాలని, లాక్ డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. జూలై 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ కట్టడి కోసం లాక్డౌన్ విధించే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో 15 రోజుల పాటు అత్యంత కఠినంగా లాక్డౌన్ విధించాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక సమర్పించడంతో దానిపై చర్చించి ప్రకటన చేయనున్నారు సీఎం కేసీయార్.లాక్డౌన్లో భాగంగా అత్యంత కఠినంగా కర్ఫ్యూ విధించాలని, రోజుకు కేవలం రెండు గంట లు మాత్రమే నిత్యావసరాల కోసం సడలింపులివ్వనుంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. లాక్డౌన్ అమలుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఏర్పడనున్న పరిణామాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. జూలై 3 నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధించే అవకాశముంది. దీంతో పాటు కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దీని గురించి కూడా మంత్రిమండలిలో చర్చించే అవకాశం ఉంది. గతేడాది జూన్ 27న సీఎం కేసీఆర్ కొత్త సెక్రటేరియెట్, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇతరులు హైకోర్టులో కేసు దాఖలు కావడంతో పనులు ప్రారంభం కాలేకపోయాయి. సరిగ్గా ఏడాది దాటిన రెండో రోజే హైకోర్టు భవనాల కూల్చివేత, కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనులు వేగవంతం చేయనున్నారు.శ్రావణ మాసంలోగా కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులకు శ్రీకారం చుడతారు.మరోవైపు లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు విద్యార్ధులను అయోమయానికి గురిచేస్తున్నాయి. జూలై నెలలో జరగబోయే కామన్ ఎంట్రన్స్ టెస్టుల భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. జులై 1 నుంచి పలు కామన్ ఎంట్రన్స్ టెస్టులు ప్రారంభం అవుతాయి. జులై 1 న జరగాల్సిన పాలిటెక్నిక్ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది. జులై 15వ తేదీ వరకూ పలు పరీక్షలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. జులై 6 నుంచి 9 వరకూ ఎంసెట్ జరగనుంది. దీనికి 2 లక్షల 22వేల మంది అప్లై చేసుకున్నారు. మిగిలిన ఎంట్రన్స్ లతో కలిపి మొత్తం 4,68,000 వేల మంది పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పలు కాలేజీలను ఎంట్రన్స్ టెస్టులకు సెంటర్లుగా కూడా ఖరారు చేశారు. ఈ సమయంలో లాక్డౌన్ విధిస్తే పరీక్షలు వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది.