సిద్దరామయ్య నిరసన
బెంగళూరు జూన్ 30
దేశంలో ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటాన్ని నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. దీంట్లో భాగంగా కర్ణాటకలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య,మరో సీనియర్ నేత డీకే శివకుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. సిద్ధరామయ్య, శివ కుమార్ ఇద్దరూ తమతమ నివాసాల నుంచి సైకిల్ తొక్కుతూ ఆందోళన జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. అనంతరం ఓ బైకుకు పాడె కట్టి అంతిమయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య, శివకుమార్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యూపీఏ హయాంలో ఇంధన ధరలు ఏ మాత్రం పెరిగినా బీజేపీ నాయకులు గగ్గోలు పెట్టేవారని, ఇప్పుడు ఇరవై రోజులకుపైగా రోజూ క్రమం తప్పకుండా ఇంధన ధరలు ఎందుకు పెరుగుతున్నా యని ప్రశ్నించారు. పెరిగిన ఇంధన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.