కాకినాడ, జూలై 1, జనసేన పార్టీ తరఫున గెలిచిన రాపాక వరప్రసాద్.. ఆశ్చర్యంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికీ.. జనసేన ఎమ్మెల్యేనే అని ఆయన బదులిచ్చారు. రాజ్యసభ సభ్యుల ఓటింగ్ సందర్భంగా ఆయన అమరావతికి వచ్చి.. ఓటేశారు. ఈ క్రమంలోనే రాపాక వరప్రసాద్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు సంధించారు. తాను పార్టీకి దూరం కాలేదని, పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నానని చెప్పారు. అయితే, పార్టీ అధినేత పవనే తనను దగ్గరకు కూడా రానివ్వడం లేదని అన్నారు. అంతటితో ఆగకుండా.. పార్టీ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తే.. తనకు కనీసం ఆహ్వానం కూడా అందడం లేదని చెప్పారు.అంతేకాదు.. తనను పార్టీ అధినేత.. తన పక్కన కూడా కూర్చోబెట్టుకునేందుకు ఇష్టపడడం లేదని రాపాక వరప్రసాద్ బాంబు పేల్చారు. ఇప్పుడు ఇదే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆది నుంచి కూడా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అండగా ఉంటానని చెప్పిన పవన్.. సొంత పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్తో కలిసి కూర్చునేందుకు కూడా ఇష్టపడడం లేదా ? అని బుగ్గలు నొక్కుకుంటున్నారు. ఇక, రాపాక మరో విషయాన్ని కూడా తెరమీ దికి తెచ్చారు. తమ పార్టీ ప్రజల సమస్యల కంటే.. వ్యక్తిగత సమస్యలకే ప్రాధాన్యం ఇస్తోందని, అందుకే తాను ప్రజల సమస్యలపై చర్చించాలని అనుకున్నా.. కుదరడం లేదని చెప్పారు.ఈ వ్యాఖ్యలు పరిశీలించిన విశ్లేషకులు.. నిజమేనా ? రాపాక వరప్రసాద్ చెప్పినట్టే జనసేనలో జరుగుతోందా ?; అనే ఆలోచనకు వస్తున్నారు. గడిచిన నాలుగు మాసాలుగా జనసేనాని పవన్ ఎక్కడా ఏపీలో ప్రత్యేకంగా పర్యటించడం లేదు. అప్పట్లో విశాఖ ఎల్ జీ పాలిమర్స్ బాధితులను పరామర్శిస్తానని చెప్పినప్పటికీ.. ఇప్పటి వరకు ఆయన రాలేదు. అదేసమయంలో రాజధాని ఉద్యమానికి ఆది నుంచి తాను అండగా ఉంటానని చెప్పిన పవన్.. తర్వాత బీజేపీతో జతకట్టిన తర్వాత ఈ విషయాన్ని పూర్తిగాఆయన పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. అంతేకాదు, ట్విట్టర్లో గతంలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన పవన్.. ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు.ఇక రాపాక వరప్రసాద్ సొంత నియోజకవర్గంలో కూడా ఆయనకు సపోర్ట్ చేయవద్దని ఇప్పటికే పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయని టాక్..? స్థానిక జనసేన కేడర్తో పాటు పవన్ సామాజిక వర్గం నేతలు అందరూ రాపాక వరప్రసాద్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు. పార్టీలోనే కాదు.. నియోజకవర్గంలోనూ రాపాకను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక గత కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే రాపాక వరప్రసాద్ చెప్పినట్టు.. జనసేన కేవలం చెప్పుకోడానికి పరిమితమయ్యే పార్టీగానే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.