YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రశాంత్ కిషోర్ సర్వే ఫీడ్ బ్యాక్ కోసం

ప్రశాంత్ కిషోర్ సర్వే ఫీడ్ బ్యాక్ కోసం

హైద్రాబాద్, జూలై 2,  ప్రశాంత్ కిషోర్ టీం మరోసారి ఆంధ్రప్రదేశ్ కు రానుంది. గత ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయానికి కారణమైన ప్రశాంత్ కిషోర్ టీం సేవలను మరోసారి ఉపయోగించుకోవాలని జగన్ నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. అయితే క్షేత్రస్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ జగన్ కు సక్రమంగా అందడం లేదు. ఏడాది నుంచి సంక్షేమ పథకాలను మాత్రమే జగన్ అమలు చేస్తున్నారు. దాదాపు 3.50 కోట్ల మంది లబ్దిదారులకు వివిధ రూపాల్లో సాయాన్ని జగన్ అందించ గలిగారు.అయితే క్షేత్రస్థాయిలో ఫీడ్ బ్యాక్ గురించి జగన్ కు తెలియడం లేదు. సొంత పార్టీ నేతలు మాత్రం అమోఘమని చెబుతున్నప్పటికీ పార్టీ పరిస్థితిని ఏడాదిలో ఎలా ఉందో తెలుసుకునేందుకు మరోసారి ప్రశాంత్ కిషోర్ టీంను జగన్ నియమించుకున్నారని చెబుతున్నారు. ఇప్పటికే జగన్ ప్రశాంత్ కిషోర్ తో మాట్లాడినట్లు తెలిసింది. ఏడాది కాలంలో పార్టీ పరిస్థితి నియోజకవర్గాల వారీగా విశ్లేషించి ఇవ్వాలని జగన్ ప్రశాంత్ కిషోర్ ను కోరినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఇసుక, ఇంగ్లీష్ మీడియం, ఇళ్లస్థలాల పంపిణీ వంటి అంశాలపై విపక్షాలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సరైన ఫీడ్ బ్యాక్ అందించగలిగేది తనకు ప్రశాంత్ కిషోర్ టీం ఒక్కటేనని జగన్ నమ్ముతున్నారు. అందుకే ప్రశాంత్ కిషోర్ టీంకు కీలకమైన విషయాలపై సర్వే చేసే బాధ్యతను అప్పగించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.గత ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో కూడా ఖచ్చితమైన ఫీడ్ బ్యాక్ ను ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చింది. ఆ నమ్మకంతోనే జగన్ మరోసారి పీకే టీంకు సంక్షేమ కార్యక్రమాల అమలుపై సర్వే చేసే బాధ్యతను అప్పగించాలని నిర్ణయించారు. దీంతో పాటు జగన్ దాదాపు ఐదు లక్షల మంది వాలంటీర్లన నియమించారు. పథకాలను నేరుగా లబ్దిదారుల ఇళ్లకే అందించాలని జగన్ ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. అయితే వాలంటీర్లకు, వైసీపీ నేతలకు మధ్య అనేక చోట్ల పొసగడం లేదు. దీంతో అనేక ఫిర్యాదులు వాలంటరీ వ్యవస్థపై జగన్ కు అందుతున్నాయి. దీనిపై కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని జగన్ ప్రశాంత్ కిషోర్ ను కోరినట్లు తెలుస్తోంది. మొత్తం మీద మరోసారి ఏపీలో ప్రశాంత్ కిషోర్ టీం సర్వే పనులను ప్రారంభించనుంది.

Related Posts