విజయవాడ, జూలై 2, 151 అసెంబ్లీ సీట్ల భారీ విజయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన అధికారం చేపట్టి సంవత్సరం గడిచింది. ఈ ఏడాది కాలంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో పలు వివాదాస్పద నిర్ణయాలు కూడడా ఉన్నాయి. అయితే, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే ఫైనల్ కావు. పలు వ్యవస్థలు ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అవకాశం రాజ్యాంగం కల్పించింది.అటువంటిదే శాసనమండలి వ్యవస్థ కూడా. అయితే, ఈ వ్యవస్థనే వైసీపీ ప్రభుత్వాన్ని పదేపదే ఇరుకున పెడుతోంది. దీంతో శాసనమండలినే రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. మండలి రద్దుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇప్పుడు మండలిపై వైసీపీ తన వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది.కేంద్రంలో రెండుసార్లు బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చినా బిల్లులను పాస్ చేయించుకోవడానికి రాజ్యసభలో బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. పదే పదే ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది. అలాగని రాజ్యసభను రద్దు చేయలేదు కేంద్రం. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇటువంటి ఆలోచననే చేశారు. రాజ్యసభ వల్ల కేంద్రం ఎదుర్కుంటున్న పరిస్థితినే రాష్ట్రంలో శాసనమండలి ద్వారా జగన్ ప్రభుత్వం ఎదుర్కుంటోంది. జగన్ చేయాలనుకున్న చట్టాలకు తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఉన్న శాసనమండలి అడ్డుకట్ట వేస్తోంది. మండలిలో తమకు ఉన్న మెజారిటీ ద్వారా ప్రభుత్వ నిర్ణయాలు అమలు కాకుండా ఆటంకాలు కలిగిస్తోంది టీడీపీ. ఇది పెద్ద ఘనకార్యంలా కూడా ఆ పార్టీ భావిస్తోంది.ఇదే నేపథ్యంలో ఆరు నెలల క్రితం పరిపాలనా వికేంద్రీకరణ అనే పేరుతో తీసుకువచ్చిన మూడు రాజధానుల బిల్లును శానసమండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. ఈ బిల్లును ఆమోదించకుండా వెనక్కు పంపుతుందని, కొంత ఆలస్యంగా అయినా బిల్లును రెండోసారి పంపించి మళ్లీ ఆమోదించుకోవచ్చని ప్రభుత్వం భావించింది. కానీ, శాసన వ్యవహారాలపై తనకు ఉన్న పట్టుని ఉపయోగించిన టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వైసీపీ అంచనాలకు భిన్నంగా ఈ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లేలా చక్రం తిప్పారు. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ తిన్నది. తమ అధికారానికి టీడీపీ శాసనమండలిని ఉపయోగించి అడ్డుపడుతున్నదని భావించింది.దీంతో ఏకంగా శాసనమండలినే రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఒక తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. నిజానికి శాసనమండలి ఉండాలనేది దివంగత ముఖ్యమంత్రి, జగన్ తండ్రి వైఎస్సార్ ఆలోచన. ఎన్టీఆర్ హయాంలో రద్దైన శాసనమండలిని తిరిగి వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక పున:ప్రారంభించారు. కానీ, వైఎస్సార్ అడుగుజాడల్లో వెళ్లే జగన్ మాత్రం శాసనమండలి వ్యవహారంలో తన తండ్రి ఆలోచనలకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు.
శాసనమండలి రద్దుకు ఆరు నెలల క్రితమే అసెంబ్లీలో తీర్మాణం చేసి పార్లమెంటుకు పంపించారు. పార్లమెంటులో ఆమోదం పొందితేనే శాసనమండలి రద్దు అవుతుంది. కానీ, ఇప్పట్లో పార్లమెంటులో ఈ తీర్మాణం ఆమోదం పొందే అవకాశాలు కనిపించడం లేదు.ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు శాసనమండలి రద్దు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో శాసనమండలి వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ మనస్సు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మండలి రద్దు అవుతందా ? లేదా ? అన్నది పక్కనపెట్టేసి మండలిలో మెజారిటీ సాధించే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. వైసీపీకి ఇప్పుడు 10 మండలి ఎమ్మెల్సీలు ఉన్నారు. ఏడాది కాలంలో శాసనమండలిలో 25 ఖాళీలు ఏర్పడనున్నాయి. ఇందులో వైసీపీ సభ్యులు నలుగురు పోను మిగతా వారు టీడీపీ, ఇతర సభ్యులే. ఖాళీ అయ్యే వాటిల్లో గవర్నర్, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటావి ఉండబోతున్నాయి. గవర్నర్, ఎమ్మెల్యే కోటావి ఎలాగూ వైసీపీ వారితో భర్తీ అవుతాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికార వైసీపీ మెజారిటీ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. ఇలా జరిగితే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలను కూడా వైసీపీ దక్కించుకుంటుంది.దీంతో వచ్చే ఏడాది వరకు మరో 20కి పైగా ఎమ్మెల్సీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు మరోపక్క ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టీడీపీ ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. వీటన్నింటిని ద్వారా వచ్చే ఏడాది జూన్ వరకు శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడం ఖాయంగానే కనిపిస్తోంది.అంటే, శాసనమండలి ద్వారా టీడీపీ ఇంకా ఏడాది మాత్రమే తన ఆధిపత్యం చూపించే వీలు ఉంది. ఏడాది తర్వాత వైసీపీ అనుకున్నది చేయగలదు. మరోవైపు, కనీసం 20 మంది నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. కాబట్టి, శాసనమండలి కొనసాగడం జగన్కు కూడా రాజకీయంగా అవసరమే. అయితే, మండలిని రద్దు చేస్తూ ఇప్పటికే తీర్మాణం పంపించినందున వెనక్కు వెళ్లే అవకాశం లేదు కానీ మండలి కొనసాగినన్ని రోజులు కూడా బలం పెంచుకునేలా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.