సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదలైన సమ్మె సెగలు
రామగుండం రీజియన్ లో బోసిపోయిన బొగ్గుగనులు
స్వచ్చందంగా విధులకు హాజరు కాని కార్మికులు
పెద్దపల్లి
సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర సర్కారు వ్యతిరేక విధానాలకు నిరసనగా సింగరేణి కార్మికులు నేటి నుంచి మూడు రోజులపాటు సమ్మెలో పాల్గొననున్నారు. ఇదే క్రమంలో జాతీయ కార్మిక సంఘాలతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో బొగ్గు గనుల వద్ద నిర్మానుష్య వాతావరణం కనిపించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లోని 1,2,3 లలో సుమారు 18 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. రామగుండం రీజియన్ లోని భూగర్భ, ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఎలాంటి సందడి వాతావరణం కనిపించలేదు. కార్మిక సంఘాల నాయకులు గనుల వద్దకు వెళ్లి నిరసన ప్రదర్శనలు చేశారు. బొగ్గు గనుల వద్ద ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు ఎదురు కాకుండా పెద్దఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ యాచన మానుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి పేర్కొన్నారు. గతంలో సమ్మెల ద్వారానే కార్మికులు హక్కులు సాధించుకున్న ఘనత ఉందని, ప్రైవేటీకరణను వెంటనే వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్త ఆందోళనలు తీవ్రతరం చేస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు.