కడప జూలై 3 ఈ నెల 7, 8 తేదీలలో జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకు ప్రణాళిక మేరకు ఏర్పాట్లను పూర్తి చేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలులో ఎస్పి కె.కె.ఎన్. అన్బురాజన్ తో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... ఈనెల 7, 8తేదీలలో రెండు రోజులపాటు ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్నారని, అయితే ఇంకనూ అధికారిక దృవీకరణ పర్యటన రావాల్సి ఉందన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈనెల 7వ తేదీన మధ్యాహ్నం కడప ఎయిర్పోర్ట్ కు ముఖ్యమంత్రి వస్తారని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయకు చేరుకుని రాత్రి బస చేయడం జరుగుతుందన్నారు. 8న ఉదయం వైయస్సార్ ఘాట్ సందర్శించి నివాళులర్పించిన అనంతరం ఆర్కె వ్యాలీ ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ చేసి, వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. అక్కడి సమీపంలో నూతనంగా నిర్మించిన ఈసిఈ బ్లాక్ మరియు ల్యాబ్ లను సందర్శిస్తారు. అనంతరం ఇడుపులపాయ హెలిప్యాడ్ కి చేరుకొని అక్కడి నుంచి కడప విమానాశ్రయం చేరుకొని తదుపరి బయల్దేరి వెళ్తారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి త్రిబుల్ ఐటీ నందు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహ ఏర్పాట్లు, ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాల శిలాఫలకాల ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. కొవిడ్-19 నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్(SoP) తప్పనిసరిగా పాటించాలన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా అతి తక్కువ సంఖ్యలో ముందస్తుగా అనుమతించిన వారిని తప్ప, ఇంకెవరిని కూడా ముఖ్యమంత్రి పర్యటనలో అనుమతించడం జరగదని ఈ మేరకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇడుపులపాయ ఎస్టేట్, ట్రిపుల్ ఐటిలలో పనిచేసే వారు, ముఖ్యమంత్రి పర్యటన విధుల్లో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మాస్కులు లేని వారిని ఎవరిని పర్యటనలో అనుమతించమన్నారు. పారిశుద్ధ్య పనులు పక్కాగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా నేపధ్యంలో ముఖ్యమంత్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించరని, ప్రత్యేకంగా స్పందన కార్యకర్తలను ఏర్పాటు చేయడం జరుగుతోందని, కార్యకర్తలు తీసుకున్న అర్జీలను ముఖ్యమంత్రి గారికి తదుపరి అందజేయడం జరుగుతుందన్నారు. కడప ఎయిర్పోర్ట్, ఇడుపులపాయ హెలిప్యాడ్, వైయస్సార్ ఘాట్ వద్ద, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ప్రోటోకాల్ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను, ఇతర కార్యక్రమాల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.