రావులపాలెం జూలై 3 వైద్య రంగంలో వినూత్న మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం మండలం గోపాలపురంలోని ఆయన నివాసం వద్ద శుక్రవారం 108, 104 వాహనాల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల మాట్లాడుతూ అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన 108, 104 వాహనాలను ప్రారంభించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ రికార్డు సృష్టించారన్నారు. ప్రజలకు సత్వర వైద్యసేవలను అందించాలనే లక్ష్యంతో వాహనాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం వైద్యరంగాన్ని పూర్తిగా విస్మరించిందని, వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యరంగంలో వినూత్న మార్పులు తెచ్చిందన్నారు. 108 నంబరుకు ఫోను చేయగానే పట్టణ ప్రాంతాలకు 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాలకు 20 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాలకు 25 నిమిషాల్లో వాహనం చేరుకుంటుందని తెలిపారు.