YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇండియన్ ఆర్మీలో 89 యాప్ లుపై నిషేధం

ఇండియన్ ఆర్మీలో 89 యాప్ లుపై నిషేధం

న్యూఢిల్లీ, జూలై 9, 
ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. జవాన్లు, సైనికాధికారులందరూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ సహా 89 రకాల యాప్‌ల నుంచి వెంటనే తమ ఖాతాలను తొలగించాలని ఆదేశించింది. మొబైల్ ఫోన్ల నుంచి ఆ యాప్‌లను తొలగించాలని సూచించింది. వీటిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించిన చైనాకు చెందిన 59 రకాల యాప్‌లు సహా కీలక యాప్‌లు ఉన్నాయి. జులై 15లోగా వీటన్నింటి నుంచి సైనికులు బయటకు రావాలని ఇండియన్ ఆర్మీ తన 13 లక్షల జవాన్లకు ఆదేశాలు జారీ చేసింది.భద్రతా కారణాలు, సెన్సిటివ్ డేటా లీకేజీ తదితర కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ ఆర్మీ బుధవారం (జులై 8) వెల్లడించింది. ఈ ఆదేశాలను పాటించని సైనికులు, అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.చైనా, పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాల నుంచి భారత సైనికులు, సైనికాధికారులు తరచూ దాడికి గురువుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీకి చెందిన ఓ అధికారి తెలిపారు. భద్రతా కారణాల రీత్యా సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌ను కూడా వాడవద్దని ఇండియన్ ఆర్మీ గతేడాది నవంబర్‌లో జవాన్లను ఆదేశించింది. సున్నితమైన, కీలకమైన సమాచారాన్ని ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర మాధ్యమాల ద్వారా షేర్ చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.భారత సైనికాధికారులు.. పాకిస్థాన్ ఏజెన్సీలకు చెందిన మహిళల హానీ ట్రాప్ వలలో పడుతున్న ఘటనలు గత మూడేళ్లలో చాలా చోటు చేసుకున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్ స్థాయి అధికారి కూడా 2018లో ఇలాంటి హానీ ట్రాప్ వలలో పడ్డారు. సున్నితమైన సమాచారాన్ని తస్కరించడానికి శత్రు దేశాల గడ్డ నుంచి ఇలాంటి కుట్రలు అనేకం జరుగుతున్నాయి. ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఇండియన్ ఆర్మీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) కూడా గతేడాది డిసెంబర్‌లో ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. నేవీ అధికారులు, సిబ్బంది ఫేస్‌బుక్‌ను వాడకుండా నిషేధం విధించింది. డాక్‌యార్డులు, ఇతర కీలక ప్రాంతాలకు మొబైల్ ఫోన్లను తీసుకురాకుండా నిషేధించింది. వైజాగ్, కార్వాన్, ముంబై కేంద్రాలను చెందిన పలువురు అధికారులు పాకిస్థాన్ మహిళల హనీ ట్రాప్ వలలో పడి కీలక సమాచారాన్ని పంచుకున్న ఘటనల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ ఆర్మీ బాటలో అటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ కూడా ఈ ఆదేశాలను జారీ చేసే అవకాశాలున్నాయి.

Related Posts