YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

జైలు నుంచి బయటకొచ్చి..హత్య చేసి సూసైడ్

జైలు నుంచి బయటకొచ్చి..హత్య చేసి సూసైడ్

మెదక్, జూలై 10,
హత్య కేసులో జైలుకెళ్లి పేరోల్‌పై విడుదలైన ఖైదీ తన భార్యను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడటం సంగారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా జైలు గోడలపై బుద్ధుడి చిత్రాలు, అందమైన పెయింటింగ్‌లను వేసి తోటి ఖైదీల్లో పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించిన అతడు ఇలా చేయడాన్ని తోటి ఖైదీలు, జైలు సిబ్బంది నమ్మలేకపోతున్నారు. పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బొమ్మరాజు శంకర్ (35) 2013లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకెళ్లాడు. 2017లో సంగారెడ్డి కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. ఇంటర్‌ మధ్యలో మానేసిన శంకర్.. జైలుకు వెళ్లాక పెయింటింగ్ వేయడాన్ని అభిరుచిగా మలుచుకున్నాడు. సంగారెడ్డి జిల్లా జైలుకు వెళ్లాక.. జైలు సూపరింటెండెంట్ ఎన్. శివకుమార్ గౌడ్, ఇతర జైలు అధికారుల నుంచి శంకర్‌కు ప్రోత్సాహం లభించింది.శంకర్‌కు అన్ స్కిల్డ్ పనులు చెప్పకుండా.. జైలు గోడలపై పెయింటింగ్స్ వేసేలా ప్రోత్సహించారు. సూపరింటెండెంట్ పెయింట్, ప్రొఫెషనల్ బ్రష్‌లను కొనుగోలు చేసి శంకర్‌కు అందించారు. మరో ముగ్గురు ఖైదీలను శంకర్‌కు సాయంగా అందించారు. తోటి ఖైదీల్లో ఒత్తిడి తొలగించడం, వారిలో సానుకూల దృక్పథం అలవడుతుందనే ఉద్దేశంతో జైలు గోడలపై శంకర్ బుద్ధుడి జీవిత విశేషాలు, ప్రవచనాలు, మహనీయుల సూక్తులు, ప్రకృతి అందాలను పెయింటింగ్స్ వేశారు.శంకర్ పనితీరు గురించి తెలుసుకున్న చంచల్‌గూడ జైలు అధికారులు ఫుట్‌బాల్ కోర్ట్‌ పెయింటింగ్ వేయడానికి ఆహ్వానించారు. కరీంనగర్ జిల్లా జైలు నుంచి కూడా ఆయనకు ఆహ్వానం దక్కింది. రోజుకు 12 గంటలపాటు పెయింటింగ్ వేస్తుంటానని.. ఇది తనలోనూ సానుకూల దృక్పథాన్ని పెంపొందించిందని శంకర్ గతంలో చెప్పాడు. 2013 పంచాయతీ ఎన్నికల్లో ఒకరి హతమార్చడంపై స్పందిస్తూ.. యువత అలాంటి స్నేహితులు, రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పాడు.ఆ ఎన్నికల్లో తను ఓ అభ్యర్థికి మద్దతు పలికానని.. ఇది ప్రత్యర్థి వర్గానికి ఆగ్రహం కలిగించిందన్న శంకర్.. వాళ్లు తనను హతమార్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని.. దీంతో సంగారెడ్డి పట్టణంలో వారిలో ఒకరిని తాను హత్య చేశానని చెప్పాడు. జైలు నుంచి విడుదలయ్యాక ప్రశాంత జీవితం గడపాలని భావిస్తున్నట్లు దాదాపు ఏడాదిన్నర క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా శంకర్ చెప్పుకొచ్చాడు.కానీ 14 రోజుల పేరోల్‌పై జూన్ 26న జైలు నుంచి విడుదలైన శంకర్.. నారాయణరెడ్డి కాలనీలోని అద్దె ఇంట్లో తన భార్య స్రవంతిని హత్య చేసి.. తను సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయం తెలియగానే జైలు సిబ్బంది, సహచర ఖైదీలు షాకయ్యారు.

Related Posts