YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రియల్ హీరో... పోస్ట్ మ్యాన్

రియల్ హీరో... పోస్ట్ మ్యాన్

చెన్నై, జూలై 10, 
ఇక్కడ కనిపిస్తున్న ఫోటో రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి తమిళనాడుకు చెందిన ఓ పోస్టుమ్యాన్. దేశం ఆయనకు జేజేలు పలుకుతోంది. వారం రోజుల కిందటే ఆయన రిటైర్ అయ్యారు. ఆయణ్ని కీర్తించడానికి బలమైన కారణమే ఉంది. ఉత్తరాలు అందించే ఉద్యోగమే అయినా.. ఆయన దాన్ని ఎంతో నిబద్ధతతో చేశారు. విధుల్లో భాగంగా నిత్యం 15 కి.మీ. దూరాన్ని కాలినడకన వెళ్లేవారు.ఏనుగులు, ఎలుగుబంట్లు, క్రూరమృగాల దాడిని కూడా లెక్కచేయకుండా.. 30 ఏళ్లుగా దట్టమైన అడవి మార్గం ద్వారా రోజూ 15 కి.మీ. నడిచి ఉత్తరాలు చేరవేసిన తమిళనాడు పోస్టుమ్యాన్.. ఇప్పుడు రియల్ హీరో..15 కి.మీ. దూరం నడిచి వెళ్లినంత మాత్రాన పెద్ద గొప్పా అనుకోవచ్చు.. కానీ, అక్కడే ఉంది అసలు విషయం. ఆయన నడిచింది దారి వెంట కాదు. దట్టమైన అడవిలో ప్రయాణం. ఎటు వైపు నుంచి ఏ క్రూరమృగం వచ్చి దాడి చేస్తుందో తెలియదు. దారి తప్పి ఒక్కసారి అడవిలోకి వెళ్తే తిరిగి వస్తాడో, రాడో కూడా తెలియదు. జంతువుల దాడిలో ఒకట్రెండు సార్లు గాయపడ్డారట. అయినా.. తన నడక ఆపలేదు. అలాంటి అటవీ మార్గాన 30 ఏళ్లుగా నడుచుకుంటూ వెళ్లి మారుమూల ప్రాంతాల వారికి ఉత్తరాలు అందించారు. అవి అందుకున్నవారి మొహంలో ఆనందం చూసి తన పడ్డ కష్టాన్నంతా మరచిపోయారు.ఆయన పేరు డి. శివన్‌. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం కన్నూర్‌లో ఆయన పోస్టుమ్యాన్‌గా విధులు నిర్వహించారు. విధుల పట్ల శివన్ చూపిన అంకితభావాన్ని మెచ్చుకుంటూ ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహూ ట్వీట్ చేశారు. దీంతో శివన్ ఫోటో వైరల్‌గా మారింది.పోస్ట్‌మ్యాన్ శివన్ ఉత్తరాలు చేరవేసేందుకు దట్టమైన అడవి ద్వారా రోజూ 15 కి.మీ. దూరం నడిచారు. ఏనుగులు, ఎలుగుబంట్ల దాడిని కూడా ఎదుర్కొని నీటి ప్రవాహాలు, జలపాతాలను దాటుకుంటూ ముందుకుసాగారు. గత వారం ఆయన రిటైర్ అయ్యేంతవరకు 30 ఏళ్లుగా అంకితభావంతో తన విధులు నిర్వహించారు.’ అని సుప్రియా సాహు ట్వీట్ చేశారు. ఉదయం 11.38 గంటలకు చేసిన ఈ ట్వీట్‌ గురువారం రాత్రి వరకు 15 వేల సార్లు రీట్వీట్ అయింది. 75 వేల మంది లైక్ చేశారు. వందల మంది కామెంట్ చేశారు. ‘దేశ నిర్మాణంలో శివన్ లాంటి వారి పాత్ర ఎంతో ముఖ్యం’, ‘ఆయన ఎంతో మంది యువతకు స్ఫూర్తి’, ‘పద్మ పురస్కారానికి ఆయన అర్హుడు’, ‘నిజమైన భరతమాత బిడ్డ’ అని కామెంట్లు పెడుతున్నారు. శివన్‌ను అభినందించిన వారిలో ఎక్కువగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ అధికారులు ఉన్నారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ శివన్‌లా అంకితభావంతో పనిచేస్తే.. దేశంలో ఇప్పటికే ఎంతో మార్పు చూసేవాళ్లం కదా..!!

Related Posts