హైదరాబాద్ జూలై 10
సెక్రటేరియట్ కూల్చివేతలో మతపరమైన ప్రదేశాలకు నష్టం వాటిల్లడంపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాలను కూల్చివేసి కొత్త భవన సముదాయం నిర్మించడానికి ప్రభుత్వం పూనుకున్న సంగతి తెలిసిందే. పాత భవనాలను కూల్చే క్రమంలో పక్కనే ఉన్న ప్రార్థనా మందిరాలపైన శిథిలాలు పడి కొంత నష్టం వాటిల్లింది. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదన్నారు.ఇలా జరగడం పట్ల తాను ఎంతో బాధపడుతున్నట్లు తెలిపారు. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం తప్ప ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా ఖర్చుకు వెనుకాడకుండా దేవాలయం, మసీదులను నిర్మిస్తామన్నారు. పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి వాటికి సంబంధించిన వ్యక్తులకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ విషయమై దేవాలయం, మసీదు నిర్వాహకులతో త్వరలోనే సమావేశమవుతానన్నారు.వారి అభిప్రాయాలు తీసుకుని కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటు ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నట్లు సీఎం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.