హైద్రాబాద్, జూలై 12
గత నెల చివర్లో జరిగిన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల అనంతరం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకుండా ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ సీఎం అజ్ఞాతంపై ప్రతిపక్షాలతో సహా నెటిజన్లు సైతం విమర్శలు చేశారు. #WhereIsKCR హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేశారు. అంతేకాక, సామాజిక మాధ్యమాల్లో సీఎంకు సంబంధించిన ట్రోలింగ్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ శనివారం సాయత్రం ప్రగతి భవన్కు చేరుకున్నారు. గత రెండు వారాలుగా ముఖ్యమంత్రి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్లోనే ఉన్నట్లుగా సమాచారం. తిరిగి ప్రగతి భవన్కు చేరుకున్న కేసీఆర్ ఒకటి రెండు రోజుల్లో రైతులతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది.సీఎం కనిపించకపోవడంపై ఏకంగా ఇద్దరు యువకులు ప్రగతిభవన్ ఎదుట హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘సీఎం కేసీఆర్ ఎక్కడ?.. ఆయన మా సీఎం. ఎక్కడ ఉన్నడో తెలుసుకోవడం మా హక్కు’’ అంటూ రాసిన ప్లకార్డులను ప్రదర్శించి వెళ్లిపోయారు. చివరికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడ? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ తీన్మార్ మల్లన్న హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.