నంద్యాల రోడ్ల విస్తరణ బాధితులు... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2017 జులై నెలలో గాంధీ చౌకు నుండి సాయిబాబా నగర్ ఆర్చ్ వరకు ఆఘమేఘాలపై రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు భవనాలను కూల్చివేశారు. గాంధీ చౌకు నుండి పద్మావతినగర్ ఆర్చ్ వరకు 60 అడుగులు, పద్మావతి నగర్ ఆర్చ్ నుండి సాయిబాబా నగర్ వరకు 80 అడుగుల రహదారి విస్తరించేందుకు ఇరువైపుల ఉన్న భవనాలను పురపాలక సంఘం అధికారులు కూల్చివేశారు. నష్టపరిహారం చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పటికి మార్చి నెలాఖరున రాష్ట్ర ప్రభుత్వం కొత్త సాప్ట్వేర్ను రూపొందించి ఆ సాఫ్ట్వేర్కు అనుగుణంగా బాధితుల వివరాలను పొందుపరచి కొత్తగా బిల్లులు పంపాలని సచివాలయం ఆదేశించడంతో బాధితులకు చెల్లింపులు ఆగిపోయాయి. అయితే మారుతున్న నిబంధనలతో బాదితులు ఆందోళనకు గురవుతున్నారు. 80 అడుగుల విస్తరణలో 166 మంది బాధితులు ఉండగా వారికి ఆరు నెలలు దాటినా ఒక్కపైసా పరిహారం అందకపోవడంతో కొన్ని రోజులుగా ఆందోళనకు దిగారు. ఇటీవల జిల్లా కలెక్టర్ నంద్యాలకు వచ్చిన ఆయనను కలసి వినతిపత్రం అందించడంతోపాటు ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి కూడా తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. కాగా చెల్లింపులు జాప్యం కావడంతో రహదారుల విస్తరణ పోరాట సమితి సాయంతో పలు ఉద్యమాలు చేపట్టారు. బాధితుల ఆందోళన, ప్రదర్శనలతోపాటు ప్రజా ప్రతినిధులను కలుస్తున్నప్పటికి ఇంత వరకు చెల్లింపులు చేయలేదు. రోడ్ల విస్తరణలో పూర్తిస్థాయిలో స్థలం, భవనాలు కోల్పోయిన వారికి పురపాలక దుకాణ సముదాయంలో ప్రత్యామ్యాయ ఏర్పాట్ల కింద దుకాణాలు కేటాయిస్తామని హామీ ఇవ్వడమే తప్ప ఇప్పటివరకు ఎవరికి దుకాణాలు కేటాయించకపోవడంతో ఆరు నెలలుగా వ్యాపారాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని బాధితులు వాపోతున్నారు.అప్పటి మార్కెట్ విలువ ప్రకారం గాంధీ చౌకు నుండి పద్మావతినగర్ ఆర్చ్ వరకు భవనాలు కూల్చివేతలో నష్టపోయిన బాధితులకు చదరపు గజం రూ.18 వేల ప్రకారం నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సమ్మతించింది. అలాగే పద్మావతినగర్ ఆర్చ్ నుండి సాయిబాబా నగర్ వరకు 80 అడుగుల రోడ్ల విస్తరణలో బాధితులకు మార్కెట్ విలువ చదరపు గజానికి రూ.6500 ఉండడంతో అప్పట్లో బాధితులు ఆందోళన నిర్వహించి ముఖ్యమంత్రికి కూడా వినతిపత్రం అందించగా అందరికీ సమానంగా నష్టపరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి అప్పట్లో సుముఖత వ్యక్తం చేశారు.. రహదారుల విస్తరణలో మొత్తం 405 మంది బాధితులు ఉన్నారు. వీరిలో గాంధీ చౌకు నుండి పద్మావతినగర్ ఆర్చ్ వరకు 60 అడుగుల రోడ్డు విస్తరణలో 236 నిర్మాణాలకు 7 వేల చదరపు అడుగులుగా లెక్కించి రూ.35.35 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 124 మందికి రూ.25.10 కోట్లు చెల్లించారు.