న్యూడిల్లీ జూలై 13
కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ రాజకుటుంబానిదేనని సుప్రీంకోర్టు తీర్పువెలువరించింది. ఆలయ నిర్వహణ వివాదంలో సుప్రీం కోర్టు ట్రావెన్కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జస్టిస్ యు.యు. లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం వెలువరించిన తీర్పులో ఆలయ నిర్వహణ బాధ్యతను రాజకుటుంబానికే అప్పగిస్తున్నట్లు చెప్పింది. జస్టీసె ఇందూ మల్హోత్రా కుడా ధర్మాసనంలో సభ్యురాలిగా వున్నారు. ఆలయ కార్యకలాపాల నిర్వహణ కోసం త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు ఈ కమిటీ కొనసాగుతుందని చెప్పింది.
ఆలయానికి సంబంధించిన సంపద, నిర్వహణ బాధ్యతలు ట్రావెన్కోర్ రాజవంశీయుల నుంచి స్వాధీనం చేసుకుని, దానికి సంబంధించి ఒక కమిటీ వేయాలని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆలయంపై తమకు హక్కులు ఉంటాయని, భక్తులకే ఈ దేవాలయం చెందుతుందని పేర్కొంటూ రాజవంశీయులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.. యాజమాన్య హక్కులపై దాఖలైన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు గత ఏడాది ఏప్రిల్లో తీర్పును రిజర్వ్ చేసి, చివరక సోమవారం తీర్పు వెల్లడించింది. 2011లో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున సంపదలు బయటపడిన విషయం తెలిసిందే. అప్పట్లో దేశ వ్యాప్తంగా ఆ ఆలయం వార్తల్లో నిలిచింది. తొమ్మిది ఏళ్ల తరువాత ఈ తీర్పు వెలువడింది.